ఆపండి, లేదంటే మా సాయం తీసుకోండి: పాక్పై రాజ్నాథ్ తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్ పైన నేరుగా మాటల దాడి చేశారు. ఉగ్రవాదాలు చేస్తున్న దాడులను పాకిస్తాన్ ఆపలేకపోతే భారత్ సాయం తీసుకోవాలని ఆయన సూచించించారు.
జమ్ముకాశ్మీర్లో వరుస దాడులు ఎవరు చేయిస్తున్నారో తెలుసునని వ్యాఖ్యానించారు. అవి పక్కా పాకిస్తాన్ ప్రేరేపిత దాడులే అని మండిపడ్డారు. తీవ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తానే అనే విషయం ప్రపంచానికి మొత్తం తెలుసునని చెప్పారు. దేనికోసం తీవ్రవాదులను పాకిస్తాన్ తమ దేశంలోకి పంపిస్తుందో చెప్పాలన్నారు.
సీపీఐ(ఎం) నేత సీతారామ్ ఏచూరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అంతర్గత భద్రత పైన స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వం ఓ వైఖరి తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఉగ్రదాడులను ఖండించారు.
కాగా, జమ్ము కాశ్మీర్లో శుక్రవారం నాలుగు చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. యూరి, శ్రీనగర్, త్రాల్ ప్రాంతాల్లో తీవ్రదాడులు జరిగాయి. ఈ దాడులలో మొత్తం 11 మంది జవాన్లు, ఓ పౌరుడు మృతి చెందారు. ఆరుగురు టెర్రరిస్టులు కూడా చనిపోయారు.