ఎన్నికల్లో మోడీకి ఓటు వేయనున్న పాకిస్తాన్ ఓటర్లు
పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి పాకిస్తాన్ ప్రాంత ప్రజలు ఓటు వేయనున్నారు. పాకిస్తాన్ ప్రజలు మోడీకి మద్దతు పలకడమేమంటే... ఇది పాకిస్తాన్ దేశం కాదు. బీహార్ జిల్లాలోని పాకిస్తాన్ అనే ప్రాంతం.
బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో పాకిస్తాన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 250 మంది ప్రజలు ఉన్నారు. వారిలో 100 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పాకిస్తాన్ గ్రామ ప్రజలు అందరు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఉన్న వందమంది ఓటర్లు ఆయనకు ఓటు వేయనున్నారు.
తాము నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని గ్రామానికి చెందిన హీరా హేమబ్రహ్మ అనే మధ్య వయసు వ్యక్తి చెబుతున్నారు. మిగతా వారు అందరూ కూడా అదే చెబుతున్నారు.
పాకిస్తాన్ గ్రామం సింఘియా పంచాయతీలో ఉంది. పూర్ణియా పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. ఇక్కడి వారంతా సంతాల్ అటవీజాతికి చెందినవారు. ఈ గ్రామంలో చదువుకున్న వారు లేరు. నిరుపేదలు.
1947లో ఈ గ్రామంలోని ముస్లింలు అందరూ తూర్పు పాకిస్తాన్ వెళ్లిపోయారు. వారికి గుర్తుగా పాకిస్తాన్ పేరును పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే, గ్రామంలో మాత్రం యాంటి పాకిస్తాన్ సెంటిమెంట్ బలంగా ఉంది.