సంక్షోభం వేళ స్ట్రాంగ్ గా పాకిస్థాన్.. బలహీనపడుతున్న భారత్..! ఇలాగే కొనసాగితే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం, ఇరాన్- అమెరికా యుద్ధం అలాగే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రూపాయి విలువల క్షీణత కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలోనే రూపాయి విలువ 7 శాతానికి పైగా పడిపోయిందని చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి, మే మధ్యకాలంలోనే 5 శాతం మేర వేగంగా పతనమైందని వివరిస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇవి భారత కరెన్సీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి.
గత 12 ఏళ్లలో భారత రూపాయి విలువ డాలర్ తో పోల్చితే ఏకంగా 62 శాతం క్షీణించింది. 2014 లో ఒక డాలర్ విలువ రూ. 58.94 గా ఉండగా.. ప్రస్తుతం అది దాదాపు రూ. 95 కు చేరింది. భారత్ లో పరిస్థితి ఇలా ఉంటే దాయాది దేశం పాకిస్థాన్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడ రూపాయి విలువ స్థిరంగా ఉండటం గమనార్హం. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సౌదీ అరేబియా నుంచి అందిన ఆర్థిక సహాయం, అంతర్జాతీయ బాండ్ మార్కెట్ లోకి పాకిస్థాన్ తిరిగి ప్రవేశించడం వల్ల పెట్టుబడి దారుల్లో నమ్మకం పెరిగింది.
ఇక పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలు వేగంగా మెరుగయ్యాయి. మార్చి త్రైమాసికంలో నమోదైన కరెంట్ అకౌంట్ మిగులు వల్ల యూఎస్ డాలర్ పై ఉన్న ఒత్తిడి తగ్గింది. అలాగే విదేశాల నుంచి వచ్చే డబ్బు స్థిరంగా పెరగడం, చమురు ధరలు అదుపులో ఉండటం వల్ల గత ఆరు నెలల్లో పాకిస్థాన్ రూపాయి డాలర్ తో పోల్చితే 1.31 శాతం బలపడింది.

మరోవైపు భారత్ లో రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా నిరోధించడానికి.. 2013 ఆర్థిక సంక్షోభం సమయంలో ఉపయోగించిన పాత వ్యూహాలనే మళ్లీ అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్లూమ్ బర్గ్ న్యూస్ తో పేర్కొన్నారు. వాటి వివరాలు చూస్తే.. వడ్డీ రేట్లను పెంచడం, అదనపు కరెన్సీ స్వాప్ లను నిర్వహించడం, రూపాయి విలువను స్థిరీకరించడానికి విదేశీ పెట్టుబడిదారుల నుంచి డాలర్లను సేకరించడం లాంటివి చేస్తోంది.












Click it and Unblock the Notifications