జయలలిత జయంతి, అమ్మ నిలువెత్తు విగ్రహం, పార్టీ దినపత్రిక, దినకరన్ చాలెంజ్!
Recommended Video
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 70 జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తమిళనాడుతో సహ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జయలలిత జయంతి వేడుకలను అమ్మ అభిమానులు నిర్వహించారు. జయలలిత జయంతి సందర్బంగా అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన నమదు పురచ్చి తలైవి అమ్మ అనే దినపత్రికను తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రారంభించారు. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జయలలిత నిలువెత్తు విగ్రహాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆవిష్కరించారు.
జయలలిత నిలువెత్తు విగ్రహం
చెన్నైలోని రాయపేట లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహం పక్కనే జయలలిత విగ్రహం ఏర్పాటు చేశారు. జయలలిత జయంతి సందర్బంగా శనివారం పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత నిలువెత్తు విగ్రహం ఆవిష్కరించారు.
అభిమానుల సందడి
జయలలిత జయంతి సందర్బంగా రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం ఆ పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది అమ్మ అభిమానుల సమక్షంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
దినకరన్ కు పోటీగా దినపత్రిక
అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం జయలలిత ఏర్పాటు చేసిన నమదు ఎంజీఆర్ దినపత్రిక ఇప్పుడు శశికళ కుటుంబ సభ్యులు, టీటీవీ దినకరన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం దినపత్రిక ఏర్పాటు చెయ్యాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారు.
అభిరామపురం
అన్నాడీఎంకే పార్టీ కోసం ఏర్పాటు చేసిన నమదు పురచ్చి తలైవి అమ్మ దినపత్రికను చెన్నైలోని అభిరామపురంలోని ఆ పత్రిక కార్యాలయంలో ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం అధికారికంగా ప్రారంభించారు.
దినకరన్ చాలెంజ్
ప్రభుత్వానికి పోటీగా టీటీవీ దినకరన్ జయలలిత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా టీటీవీ దినకరన్ మాట్లాడుతూ పళనిస్వామి ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం పెట్టిన రోజు ఆయనకు మద్దతు ఇస్తున్న వారిలోని తన స్లీపర్ సెల్స్ బయటకు వస్తాయని అన్నారు.
తీరికలేకుండా!
జయలలిత జయంతి వేడుకల సందర్బంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం బిజీబిజీగా గడుపుతున్నారు. తీరకలేని కార్యక్రమాలలో సీఎం, పన్నీర్ తో పాటు మంత్రులు పాల్గొంటున్నారు.
సీఎం, పన్నీర్ వార్నింగ్
ఎంత మంది దినకరన్ లు తయారు అయినా అన్నాడీఎంకే ప్రభుత్వం పునాదులు కదలించలేరని, ఈ ప్రభుత్వాన్ని అమ్మ అధికారంలోకి తెచ్చారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం అన్నారు. ప్రతిపక్షాలతో చేతులు కలపాలని టీటీవీ దినకరన్ కుట్రపన్నుతున్నారని, వారికి కార్యకర్తలే సరైన సమాధానం చెబుతారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం హెచ్చరించారు.