Padora Papers: మనోళ్లు చాలామందే ఉన్నారుగా: 300 ప్లస్.. రాజకీయ నాయకులు సైతం
న్యూఢిల్లీ: ఇది వరకు ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పనామా డాక్యుమెంట్స్. రాజకీయంగా కూడా పెను దుమారానికి దారి తీసింది ఈ ఘటన. అలాంటిదే మరో బిగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పాండోరా పేపర్స్ లీక్.. ప్రపంచ వ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖుల పన్ను ఎగవేత వ్యవహారాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదివరకు పనామా పేపర్ల కుంభకోణాన్ని కూడా బయటపెట్టింది ఈ కర్సార్టియమే.
భారత్ సహా అనేక దేశాలకు చెందిన ప్రముఖులు పన్ను ఎగవేత కుంభకోణంలో ఉన్నారు. భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టాప్ ఇండస్ట్రీయలిస్ట్ కిరణ్ మజుందార్ షా భర్త, బిట్ కాయిన్ ప్రమోటర్, బ్యాంకులను మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరి.. ఇలా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. ఇందులో 60 మంది వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
అనిల్ అంబాని పేరు మీద 18 ఆఫ్షోర్స్ అస్సెట్ హోల్డింగ్ కంపెనీలు ఉన్నట్లు తేలింది. బినామీ పేర్లతో తక్కువ పన్నును వసూలు చేసే దేశాల్లో వారంతా ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఐసీఐజే తెలిపింది. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపార-వాణిజ్య వేత్తలు లక్షల కోట్ల రూపాయల మేర పన్నులను ఎగ్గొట్టినట్లు తమ ఇన్వెస్టిగేషన్తో తేలిందని పేర్కొంది. పనామాతో పాటు దుబాయ్, స్విట్జర్లాండ్లల్లో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారని, వాటిని నష్టాలుగా చూపించి, పన్నులను ఎగవేశారని స్పష్టం చేసింది.
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కేబినెట్ సహచరులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల పేర్లు ఈ పాండోరా డాక్యుమెంట్లలో ఉన్నాయి. ఉక్రెయిన్, ఈక్వెడార్, లెబనాన్, చెక్ రిపబ్లిక్ దేశాధినేతలు, ప్రధానమంత్రులు సైతం పన్నులను ఎగ్గొట్టారని, బినామీ పేర్లతో వేర్వేరు దేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారని ఐసీఐజే డాక్యుమెంట్లు స్పష్టం చేస్తోన్నాయి. కొన్ని నకిలీ కంపెనీలను సృష్టించి.. వాటికి నిధులను బదలాయించారని ఐసీఐజే పేర్కొంది.
ఇలా వేర్వేరు దేశాధినేతలు, ప్రధానమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు 3,926 ఆఫ్షోర్ కంపెనీల సృష్టించారని, అవన్నీ నకిలీవేనని ఐసీఐజే తన డాక్యుమెంట్లలో స్పష్టం చేసింది. న్యూజిలాండ్, ఉరుగ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటీష్ వర్జిన్ ఐలండ్స్లల్లో 312 కంపెనీల వరకు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొంది. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీస్ జెయింట్ మోర్గాన్ స్టాన్లీ చేసిన విజ్ఞప్తి మేరకు బ్రిటీష్ వర్జిన్ ఐలండ్స్లో కొత్త కంపెనీలు వెలిసినట్లు తెలిపింది.