పన్నీరును కౌగిలించుకొని ఏడ్చిన ఎమ్మెల్యే, జయ ఫ్యామిలీకి విజ్ఞప్తి
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు పదకొండుమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ ఆయన వర్గంలో ఆనందం కనిపిస్తోంది.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు పదకొండుమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ ఆయన వర్గంలో ఆనందం కనిపిస్తోంది. శశికళ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ వర్గంలో ఆందోళన కనిపిస్తోంది.
ఆదివారం నాడు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు పన్నీరు వైపు మొగ్గు చూపారు. ఇటీవలి వరకు శశికళ వర్గంలో ఉండి, ఆ తర్వాత తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే ఒకరు, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయన్ను కౌగిలించుకుని, ముద్దు పెట్టి ఏడ్చారట.
తమను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. శశికళ శిబిరంలోని చాలామంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, తప్పించుకు వచ్చేందుకు మార్గాలను వెదుకుతున్నారని చెప్పారని తెలుస్తోంది. వారందరినీ బయటకు రప్పించాలన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత దురై పాండియన్ వేరుగా స్పందించారు. పన్నీరు సెల్వం రేపు ఎమ్మెల్యేలు ఉన్న లగ్జరీ రిసార్టుకు పంపించి వారిని విడిపిస్తారని ఆదివారం నాడు వ్యాఖ్యానించారు.
మరోవైపు, పన్నీరుకు సినీ తారల మద్దతు కూడా లభిస్తోంది. నటుడు అరుణ్ పాండ్యన్ పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి మద్దతు తెలిపారు.
తన ఇంటి ముందు మీడియాతో మాట్లాడిన పన్నీరు సెల్వం.. జయలలిత కుటుంబ సభ్యులు తనకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. వారంతా తనతో కలిసొస్తే సంతోషమని, వారు రాకున్నా జయ కుటుంబీకులుగా జీవితాంతమూ గౌరవిస్తానని చెప్పారు.
జయలలిత పక్కనబెట్టిన శశికళ బంధువర్గాన్ని, ఆమె మరణించగానే తిరిగి తన పంచన ఎందుకు చేర్చుకున్నారని శశికళను పన్నీరు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేని పనిని శశికళ ఎందుకు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications