పన్నీర్ సెల్వం నోట ఆత్మహత్య, శశికళ ఫ్యామిలీ, తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు !
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ, ఆమె కుటుంబ సభ్యుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్థానంలో వేరే వారు ఉండిఉంటే శశికళ, మన్నార్ గుడి మాఫియా కారణంగా కచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవారని బాంబు పేల్చారు, శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తనను అంతగా వేధించారని పన్నీర్ సెల్వం ఆరోపించడంతో తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
తేనిలో సమావేశం
తమిళనాడులోని తేని నగరంలో ఆజిల్లా అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పన్నీర్ సెల్వం శశికళ, ఆమె కుటుంబ సభ్యుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సంవత్సరం క్రితం శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తనను చిత్రహింసలు పెట్టారని పన్నీర్ సెల్వం ఆరోపించారు.
అమ్మ అశీర్వాదం
జయలలిత బతికి ఉన్న సమయంలో ఆమె ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి అయ్యానని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. అపోలో ఆసుపత్రిలో అమ్మ జయలలిత మరణించిన తరువాత పార్టీ నాయకులు అందరూ కలిసి తనను మళ్లీ ముఖ్యమంత్రిని చేశారని పన్నీర్ సెల్వం అన్నారు.
Recommended Video
సీఎం పదవి కోసం
శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తనను రాజీనామా చెయ్యాలని మానసిక, శారీరకంగా హింసించారని పన్నీర్ సెల్వం బాంబు పేల్చారు. తనను మానసికంగా హింసించి బలవంతంగా రాజీనామా చేయించారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
అమ్మ ఆత్మ చెప్పింది
శశికళ మీద తిరుగుబాటు చెయ్యాలని అమ్మ ఆత్మ చెప్పడంతో తాను ధర్మయుద్దం చేశానని పన్నీర్ సెల్వం అన్నారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.
మోడీ చెప్పారని ఓకే
రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తనను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని జయలలిత పాలన కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించడంతో ఆ పదవి తీసుకున్నానని పన్నీర్ సెల్వం కార్యాకర్తలకు చెప్పారు.
ఇంకా 99 శాతం ఉంది
శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తనపట్ల ప్రవర్తించిన తీరు ఒక్క శాతం మాత్రమే చెప్పానని, ఇంకా 99 శాతం మిగిలే ఉందని, త్వరలో మొత్తం ప్రపంచానికి వాళ్ల అరచాకాలు గురించి చాటి చెబుతానని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.