జయలలిత మృతి కేసు సీబీఐతో దర్యాప్తు: రాష్ట్రపతి దగ్గరకు రెబల్ ఎంపీలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నిజస్వరూపం బయటపెడుతామని సోమవారం హెచ్చరించారు. అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎంపీలతో కలిసి శశికళ మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నాడీఎంకేలోని రెబల్ ఎంపీలు గుర్తు చేశారు. తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జయలలిత ఎలా మరణించారు ? అనే విషయం అందరికీ తెలియాలని వారు అన్నారు.
జయలలిత మృతి వెనుక అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు అనేక మంది మీద అనుమానాలు ఉన్నాయని, ఆ పూర్తి విషయాలు బయటకురావాలంటే కచ్చితంగా సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు చెప్పారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు (పన్నీర్ సెల్వం వర్గీయులు)తో కలిసి జయలలిత మృతిపై సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని తాము మంగళవార రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మనవి చేస్తామని సోమవారం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకులు మీడియాకు చెప్పారు.
మంగళవారం తమిళనాడు నుంచి అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి ఢిల్లీ వెలుతున్నానని పన్నీర్ సెల్వం వర్గీయులు మీడియాకు చెప్పారు. పన్నీర్ సెల్వం వర్గీయుల నిర్ణయంపై అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే శశికళ వర్గీయులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications