డెంగ్యూతో బొప్పాయికి గిరాకీ! ఆ విషయంలో రైతులు, వ్యాపారులు ఘర్షణ
డెంగ్యూ వ్యాధి బొప్పాయి పండ్లకు గిరాకిని పెంచింది. డెంగ్యూ బారిన పడిన వారు బొప్పాయి తినాలని డాక్టర్లు సూచించడంతో బహిరంగ మార్కెట్లో దానికి గిరాకి పెరుగుతోంది. ప్లేట్లెట్స్ సంఖ్య తక్షణమే పెరిగేందుకు బోప్పాయి దోహదం చేస్తుండడంతో దానికోసం జనాలు పరుగులు తీస్తున్నారు. ఇరుగు పొరుగు ఇంట్లో బొప్పాయి పండ్లతో పాటు చెట్టు ఆకులను సైతం తీసుకెళ్లి తింటున్నారు. దీంతో బొప్పాయి మార్కెట్లో దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ధరలు విపరీతంగా పెరిగాయి.
జంట నగరాల్లో పెరిగిన బొప్పాయి డిమాండ్
గత రెండు నెలలుగా వైరల్ ఫీవర్ హైదరాబాద్ జంటనగరాల్లో విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే..ఏ చిన్న ఆసుపత్రి చూసిన రోగులతో కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా డెంగ్యూ విజృంభించడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి బారిన పడినవారికి ప్లేట్లెట్స్ తగ్గడంతో వేల రుపాయలను ఆసుపత్రుల్లో ఖర్చుపెట్టాల్సి వస్తోంది. దీంతో ప్లేట్లెట్స్ రికవరి కోసం బొప్పాయి పండ్లతో పాటు,వాటి చెట్టు ఆకుల రసాలను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని ద్వార త్వరగా రికవరి అవుతారని చెబుతున్నారు.
రైతుల తక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులు
దీంతో మార్కెట్లో బొప్పాయికి మార్కెట్లో గిరాకి పెరిగింది. బోప్పాయి పండ్ల వినియోగం పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.అయితే పెరిగిన రేట్లకు అనుగుణంగా బోప్పాయిని పండించే రైతులకు మాత్రం లాభం చేకూరడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రైతులు ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. దీంతో మార్కెట్కు చేరుకుంటున్న రైతులు నిరాశలో ఉన్నారు. బయట కిలో కనీసం వంద రుపాయలు అమ్ముకుంటుంటే అందులో కనీసం సగం రేటు కూడ రైతులకు దక్కడం లేదనే ఆవేదనతో రైతులు ఉన్నారు.
కొత్త పేట మార్కెట్లో వివాదం
ఈ ధరల నేపథ్యంలోనే పండ్లను పండించిన రైతులకు, మరియు వ్యాపారుల మధ్య ధరల విషయంలో విభేదాలు వస్తున్నాయి. మార్కెట్లో రైతులకు తక్కువ ధర చెల్లించి వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తూ తాము తెచ్చిన పళ్లను తామే అమ్ముకుంటామంటూ కొత్త పేట మార్కెట్ రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం ఉదయం ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టుకుని నేరుగా రిటైల్ వ్యాపారస్తులకు అమ్ముకునే ప్రయత్నం చేశారు.
రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ
దీంతో మార్కెట్లో లైసెన్స్లు తీసుకుని వ్యాపారం చేస్తున్న యజమానాలు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ప్రత్యేక కౌంటర్ల ద్వార పళ్లను అమ్ముతున్న రైతులపై కొంతమంది వ్యాపారులు దాడులు చేసినట్టు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేసినట్టు తెలుస్తోంది.