పరువు: ప్రేమికులను చంపేసిన తల్లిదండ్రులు
ధోలాపూర్: పరువు హత్యలు చేసి తప్పించుకుని తిరుగుతున్న అమ్మాయి తల్లిదండ్రులను రాజస్థాన్ లోని ధోలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గిరిరాజ్, జల్దేవి అనే దంపతులను అరెస్టు చేశామని ధోలాపూర్ జిల్లా ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు.
ఇదే కేసులో ఈ దంపతుల అల్లుడు శైలేంద్ర పరారైనాడని ఆయన అన్నారు. రాజేష్ సింగ్ కథనం మేరకు గిరిరాజ్, జల్దేవి దంపతులకు భారతీ కుష్వాహ (19) అనే కుమార్తె ఉంది. నరేష్ ఠాకూర్ (21) అనే యువకుడు భారతీ ప్రేమించుకుంటున్నారు.
గత 8 నెలల నుంచి ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. భారతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఇద్దరి కులాలు వేరు అంటూ వారు పెళ్లికి అంగీకరించలేదు. భారతి అక్క భర్త శైలేంద్ర. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు.

అయితే తల్లిదండ్రులను ఎదిరించిన భారతి అప్పుడప్పుడూ తన ప్రియుడు నరేష్ ఠాకూర్ ను కలిసేది. ఈ విషయం తెలుసుకున్న భారతి తల్లిదండ్రులు ఎలాగైనా వీరిని అంతం చెయ్యాలని, లేదంటే ఊరిలో తల ఎత్తుకుని తిరగలేమని నిర్ణయించారు.
పెద్ద అల్లుడు శైలేంద్రకు విషయం చెప్పారు. శైలేంద్ర భారతి, నరేష్ ను పిలిచి తాను దగ్గర ఉండి మీ వివాహం జరిపిస్తానని నమ్మించాడు. ఇద్దరిని ధోలాపూర్ సమీపంలోని నాగ్ల గ్రామం దగ్గరకు రావాలని చెప్పాడు.
గత వారంలో ప్రేమికులు ఇద్దరూ నాగ్ల గ్రామం దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న గిరిరాజ్, జల్దేవి, శైలేంద్ర ప్రేమికులను పట్టుకుని నిర్జనప్రదేశంలోకి తీసుకువెళ్లి ఇద్దరి గొంతులు నులిమి హత్య చేశారు. మృతదేహాలను సమీపంలో విసిరివేసి అక్కడి నుంచి పరారైనారు.
ధోలాపూర్ లో ఈ ప్రేమ జంట హత్య కేసు సంచలనం రేపింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. పరువు హత్యలు జరిగాయని నిర్ధారించుకున్న పోలీసులు భారతి తల్లిదండ్రులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications