ఈ పేద తల్లిదండ్రుల దు:ఖం ఆపేదెవరు... సర్కార్ దవాఖానా ఎంత పనిచేసింది..
వాళ్లు నిరుపేదలు.. చేతిలో డబ్బు లేదు... ఏడాదిన్నర కొడుకు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. సర్కార్ ఆస్పత్రి తప్ప మరో దిక్కు లేదు. కొడుకును భుజాన వేసుకుని ఇద్దరూ ఆస్పత్రికి పరిగెత్తారు. కానీ వైద్యులు కనికరించలేదు. ఇక్కడ కాదు 90కి.మీ దూరంలో ఉన్న మరో టౌన్కు వెళ్లాలని సూచించారు. కానీ కొడుకు పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. అంత దూరం వెళ్లేందుకు కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేని ధీనస్థితి. అయితే అక్కడే ఉన్న కొందరు.. వైద్యుల తీరును సెల్ఫోన్లలో చిత్రీకరించారు. వీడియోలు బయటకొస్తే ఉద్యోగాలు పోతాయేమోనన్న భయంతో ఎట్టకేలకు బాలుడికి చికిత్స అందించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. కాసేపటికే బాలుడి శవాన్ని తెచ్చి చేతుల్లో పెట్టారు.

అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్కి చెందిన ప్రేమ్చంద్-ఆశా దేవీ దంపతులకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. ఆదివారం(జూన్ 28) ఉన్నట్టుండి ఆ చిన్నారి జబ్బు పడ్డాడు. తీవ్ర జ్వరంతో పాటు మెడ వద్ద పెద్ద వాపు వచ్చింది. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు కన్నౌజ్ ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తారు. కానీ అక్కడికెళ్లాక వైద్యులు వైద్యానికి నిరాకరించారు. అక్కడికి 90కి.మీ దూరంలో ఉన్న కాన్పూర్కి తీసుకెళ్లాలని.. అక్కడైతేనే మెరుగైన చికిత్స అందుతుందని చెప్పారు.

చాలాసేపటికి ఎమర్జెన్సీ వార్డుకు...
వైద్యులు నిరాకరించడంతో ఆ దంపతులు చాలాసేపు వారిని బతిమాలారు.ఆ సమయంలో కొంతమంది ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. వీడియో చిత్రీకరించారన్న విషయం తెలిశాక.. అప్పటికప్పుడు బాలుడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. కానీ ఆ తర్వాత అరగంటకే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

కొడుకు మృతదేహాన్ని గుండెలకు హత్తుకుని...
నేలపై పడుకుని కొడుకు మృతదేహాన్ని గుండెలకు హత్తుకున్న తండ్రి.. పక్కనే తల్లి... ఇద్దరూ కన్నీరుమున్నీరవుతూ కనిపించారు. కొంతమంది ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై ఆ బాలుడి తండ్రి మాట్లాడుతూ... 'నేనో పేదవాడిని. నా వద్ద డబ్బు లేదు. నేనేం చేయగలను. మొదట మా కొడుక్కి వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. ఎవరో కొంతమంది వీడియో తీశారని తెలిసి... అప్పుడు ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అప్పటివరకూ కనీసం బాలుడిని టచ్ కూడా చేయలేదు. తీరా లోపలికి తీసుకెళ్లిన కాసేపటికే మృతి చెందాడని చెప్పారు.' అని వాపోయాడు.

తమ తప్పేమీ లేదంటున్న వైద్యులు..
మరోవైపు ఆస్పత్రి వైద్యులు,సిబ్బంది మాత్రం ఆ తల్లిదండ్రుల ఆరోపణలను ఖండిస్తున్నారు. వాళ్లు సాయంత్రం 4.15గంటలకు ఆస్పత్రికి వచ్చారని,ఆ వెంటనే బాలుడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించామని చెప్పారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని... చైల్డ్ స్పెషలిస్టును కూడా పిలిపించామని... కానీ ఇంతలోనే బాలుడు ప్రాణాలు విడిచాడని చెప్పారు. తమవంతుగా తాము చేయాల్సింది చేశామని...అయినా అతన్ని కాపాడలేకపోయామని చెప్పారు. ఆస్పత్రిలో ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్థానిక ఉన్నత స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.












Click it and Unblock the Notifications