పార్లమెంట్ వర్షాకాల సెషన్ వృథా ? సగం సమయం వృథా ! ఈసారి జరిగిందిదే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తాజాగా ముగిశాయి. ఈసారి వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తనకు కావాల్సిన బిల్లుల్ని నెగ్గించుకోగా.. విపక్షాలు అవిశ్వాస తీర్మానంతో మణిపూర్ పై ప్రధాని మోడీ నోరు తెరిపించాయి. అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయినా విపక్షాల పంతం మాత్రం నెగ్గింది. కానీ దీని కోసం పార్లమెంటు సగం సమయం వృథా అయిపోయింది. దీనికి కేంద్రంతో పాటు విపక్షాలు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్దితి.
తాజాగా వెలువడిన పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంకలన డేటా ప్రకారం, లోక్ సభలో ఈసారి మొత్తం 17 సమావేశాలు జరిగాయి. లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో దాదాపు 44 గంటల 15 నిమిషాల పాటు కొనసాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ 19 గంటల 59 నిమిషాల పాటు కొనసాగగా, 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. మూజువాణి ఓటు ద్వారా అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. విపక్షాలు ప్రధానితో మణిపూర్ పై ప్రకటన చేయించామన్న సంబరంలో చివర్లో వాకౌట్ చేసేశాయి.

మరోవైపు ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) వంటి ఇరవై మూడు బిల్లులు ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదించబడ్డాయి. అలాగే మూడు క్రిమినల్ చట్టాల స్ధానంలో మూడు బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వీటిని తదుపరి సూచనల కోసం సిఫార్సు చేసింది.
ఈ వర్షాకాల సెషన్లో ప్రవేశపెట్టిన బిల్లుల్లో దాదాపు 56 శాతం ఉభయ సభలు ఆమోదించాయి. సగటున ఈ సెషన్లో ప్రవేశపెట్టిన బిల్లు ఎనిమిది రోజులలో ఆమోదించబడింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుల్లో ఢిల్లీ సేవల బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇది లోక్సభలో సుమారు నాలుగు గంటల 54 నిమిషాలు, రాజ్యసభలో దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చకు వచ్చింది. ఆ తర్వాత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 56 నిమిషాల వరకు చర్చించారు. అలాగే రాజ్యసభలో గంటకు పైగా చర్చించారు.












Click it and Unblock the Notifications