నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు - మణిపూర్ పై చర్చ, 31 బిల్లులు..!!
మారుతున్న జాతీయ రాజకీయ సమీకరణాల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో 17 రోజుల పాటు సమావేశమవుతుంది. ప్రారంభానికి ముందు రోజు ఆనవాయితీగా జరిపే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో మొత్తం 31 బిల్లులను టేబుల్ చేయనున్నారు. మణిపూర్ అంశం పైన నిలదీసేందకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి.
ఇండియా' పేరిట కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఉమ్మడిగా అంశాలు లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గవర్నర్ల వ్యవస్థ వంటి అంశాలను లేనెత్తాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే, కేంద్రం తీసుకొస్తున్న ఢిల్లీ సర్వీసుల ఆర్డినెన్సు బిల్లును అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పార్లమెంటు రణరంగంగా మారే అవకాశముంది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు డిమాండ్ చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఒడిశాకు ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టాలని బీజేడీ ప్రతిపాదించింది. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, కుల గణన, మహిళా రిజర్వేషన్ బిల్లు, మణిపూర్ అల్లర్లు, బాలసోర్ రైలు ప్రమాదం, ప్రతిపక్షాలపై ఈడి, సిబిఐ దుర్వినియోగం, ఎన్నికైన ప్రభుత్వాలపై గవర్నర్ల ఆధిపత్యం, సమాఖ్యవాదంపై దాడి, ఢిల్లీ ఆర్డినెన్స్ వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అన్ని అంశాలపై చర్చించేందుకు, లేవనెత్తడానికి అవకాశం ఇస్తామని, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రులు కోరారు. మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
తాజాగా అటు ఇండియా, ఇటు ఎన్డీఏ సమావేశం తరువాత రెండు పక్షాలు రాజకీయంగా కొత్త వ్యూహాలతో ఈ సమావేశాకు సిద్దం అవుతున్నాయి. ప్రతీ రోజు సమావేశమై సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల ను నిర్ణయించాలని ఇండియా భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం..వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ప్రస్తుత సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీఆర్ఎస్, వైసీపీలు కేంద్రాన్ని కోరాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంలోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications