షాకింగ్: బయటివాళ్లు చొరబడి మహిళా ఎంపీలను కొట్టారు -వెంకయ్యా.. ఇదేంది? -రాహుల్, విపక్షాల ఫైర్
పార్లమెంట్ ఉభయసభలు షెడ్యూల్ కు ముందే నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా సభ లోపల చోటుచేసుకున్న ఘటనలపై రచ్చ కొనసాగుతోంది. పెగాసస్ నిఘా కుట్ర, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, పెట్రో సహా నిత్యావసరాల అధిక ధరలు, కరోనా విపత్తు నిర్వహణలో మోదీ వైఫల్యం... ఇలా విపక్షాలు లేవనెత్తిన ఏ ఒక్క అంశంపైనా చర్చకు అనుమతించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదోవ పట్టిస్తే, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి..
మహిళా ఎంపీలపై దాడి..
రాజ్యసభలో మహిళా ఎంపీలపై బయటి వ్యక్తుల దాడి, పురుష ఎంపీలను నిలువరిచేందుకు మహిళల్ని పావులుగా ప్రభుత్వం వాడుకున్న వైనాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఏనాడూ ఇంతటి దారుణం జరగలేదని, అసలు వెంకయ్య నాయుడు, ఓం బిర్లాలకు సభ నడిపే సోయి ఉందా? అని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు రాజ్యసభలో జరిగిన ఘటనలను గర్హిస్తూ కాంగ్రెస్ సహా 15 విపక్ష పార్టీలు ఇవాళ(గురువారం) పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు.
జగన్ సర్కారు సంచలనం: నిజం చెప్పిన తొలి రాష్ట్రం ఏపీ -మోదీ సాయం అందేనా? -భారత్ ఫార్మాకు ఉచ్చు
వెంకయ్యా.. ఇదేందయ్యా?
''రాజ్యసభలో చైర్మన్ కావొచ్చే, లోక్ సభలో స్పీకర్ కావొచ్చు.. అసలు వాళ్ల పనేంటి? సభను సజావుగా నడిపించడమే కదా? మరి సభలో విపక్షాలు భాగం కాదా? ఎంతసేపూ అధికార పక్షం మాటేగానీ, దేశంలో 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? మేం లేవనెత్తే అంశాలపై చర్చకు ఛాన్స్ ఇవ్వరా? చేయాల్సిందతా వాళ్లు చేసి, ప్రతిపక్షాల వల్లే సభా సమయం వృధా అయిందనడంలో ఏమైనా అర్థం ఉందా? ఇది విపక్షాల గొంతునొక్కడం కాదా? మోదీ సర్కారుది అణిచివేత వైఖరి కాదనగలమా? దేశాన్ని తెగనమ్ముతున్న మోదీ ప్రభుత్వంపై గొంతెత్తిన వారిని వేధింపులకు గురిచేస్తారా? దాన్ని సభాపతి స్థానంలో ఉన్నవాళ్లు సమర్థిస్తారా?'' అంటూ ఉభయ సభల అధిపతులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడ vs మగ: ఎవరా బయటి వ్యక్తులు?
బయటి వ్యక్తులతో మహిళా ఎంపీలపై దాడి చేయించారన్న విపక్షాలు ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. సీసీటీవీ ఫుటేజీలు చూస్తే నిజమేంటో తెలుస్తుందన్న ఆయన, బుధవారం నాటి ఘటనలపై విచారణకు మాత్రం వెనుకడుగేయడం గమనార్హం. అసలు సభలో ఏం జరిగిందంటే.. బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభయ్యాక చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యుల ప్రవర్తనపై బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వాయిదాల తర్వాతా నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, ఓబీసీ బిల్లు (127వ రాజ్యాంగ సవరణ బిల్లు)పై చర్చను చేపట్టారు. ఆ బిల్లు ఆమోదం పొందగానే ప్రభుత్వం తెలివిగా బీమా బిల్లును ప్రవేశపెట్టింది. దేశంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు ఉపకరించే సదరు బీమా బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి గొడవ చేశారు. అప్పటికప్పుడే 50 మంది మార్షల్స్ ను రప్పించిన ప్రభుత్వం.. ఎంపీలను కట్టడి చేసింది. మహిళా ఎంపీలు నిరసన తెలిపే దగ్గర పురుష భద్రతా సిబ్బందిని, పురుష ఎంపీలు నిరసన తెలుపుతున్న చోట మహిళా భద్రతా సిబ్బందిని ఉంచారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాగితాలను చించి చైర్ పైకి, సభ అధికారులపైకి విసిరేశారు. భద్రతా సిబ్బందితో పెనుగులాటకు దిగారు. ఈ క్రమంలో పురుష మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఛాయా వర్మ, ఫులో దేవీ నేతమ్ ఆరోపించారు. కాగా,
ఇలాంటి దాడి ఏనాడూ చూడలే..
రాజ్యసభలో బుధవారం జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ భౌతికంగా దాడిచేశారనే ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన 55 ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో మహిళా ఎంపీలపై దాడి చూడలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. 40 మందికి పైగా బయటి వ్యక్తుల్ని లోపలికి తీసుకువచ్చారని ఆరోపించారు. పార్లమెంట్లోనే మహిళా ఎంపీలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మగ మార్షల్స్ మహిళా ఎంపీలపై భౌతికంగా దాడి చేశారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఆరోపించారు. కాగా.. విపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ప్రతిపక్ష ఎంపీలేమార్షల్స్ పై దాడి చేశారని, ఒక మహిళా మార్షల్స్ చేయిని మెలితిప్పారని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు. కాగా, రాజ్యసభలో 28 గంటల పాటు కార్యకలాపాలు జరగగా 76 గంటలను కోల్పోయామని అధికార వర్గాలు తెలిపాయి. సభలో 19 బిల్లులు ఆమోదించారని, 4 బిల్లులు ప్రవేశపెట్టారని, 51 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం లభించిందని, ప్రశ్నోత్తరాల సమయానికి 14 శాతం మాత్రమే వెచ్చించగలిగామని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటు లోక్ సభలో కేవలం 21 గంటలు మాత్రమే పని జరిగినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.