Parliament Round Up : నాలుగో రోజూ విపక్షం నిరసనలు-సస్పెండైన ఎంపీలతో రాహుల్ భేటీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నాలుగో రోజు కూడా విపక్షాల నిరసనలు కొనసాగాయి. లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ కీలక సమస్యలపై కేంద్రం పట్టు వీడకపోవడంతో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. దీంతో ఓ దశలో ప్రధాని మోడీ సమస్య పరిష్కారం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు.
సహాయక పునరుత్పత్తి సాంకేతిక (నియంత్రణ) బిల్లును ఇవాళ లోక్సభ ఆమోదించింది. ఇవాళ లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ కేంద్రం ఆనకట్టల భద్రతా బిల్లుపై చర్చ చేపట్టింది. దీనిపై అధికార ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు వైసీపీ వంటి పార్టీలు కూడా సానుకూలత వ్యక్తంచేశాయి. విపక్ష పార్టీలు మాత్రం ఆనకట్టల భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం తమ అధికారాల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సమాఖ్య విధానానికి ముప్పని తెలిపారు. దీంతో కేంద్రం ఆ ఆరోపణల్ని తిప్పికొట్టింది. అనంతరం ఆనకట్టల భద్రతా బిల్లును ఉభయసభలు ఆమోదించాయి.
మరోవైపు ఓమిక్రాన్ వైరస్ పై ఇవాళ లోక్ సభలో చర్చ జరిగింతి. అంతర్జాతీయంగా కూడా విమానాలను నెమ్మదిగా పెంచేందుకు ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉందని లోక్సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇలాంటి తరుణంలో ఓమిక్రాన్ ముప్పు అందరికీ ఎదురుదెబ్బగా ఆయన అభివర్ణించారు.

మరోవైపు రాజ్యసభలో విపక్షాల నిరసనలు కొనసాగాయి. సస్పెండైన రాజ్యసభ ఎంపీలు పార్లమెంంటు బయట ధర్నా కొనసాగించారు. ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సస్పెండ్ చేసిన సభ్యులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వారిపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు రాజ్యసభ ఛైర్మన్ ఇవాళ కూడా నిరాకరించారు. మరోవైపు గత మూడేళ్లలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 57 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులను కేంద్రం స్వీకరించినట్లు కేంద్రం ఇవాళ రాజ్యసభకు తెలియజేసింది. వీటిలో 54.65 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు హైలెట్స్
- నాలుగోరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
- సహాయక పునరుత్పత్తి సాంకేతిక (నియంత్రణ) బిల్లుకు లోక్ సభ ఆమోదం
- ఆనకట్టల భద్రతా బిల్లుపై లోక్ సభ, రాజ్యసభలో చర్చ
- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షాల నిరసనలు
- సస్పెండైన రాజ్యసభ ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
- కరోనా వేరియంట్ ఓమిక్రాన్ పై లోక్ సభలో కేంద్రం ప్రకటన
- డ్యామ్ భద్రతా బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం












Click it and Unblock the Notifications