Parliament round up today : లోక్ సభలో ఫార్మా, డ్రగ్స్ బిల్లులు, నాగాలాండ్ పై షా ప్రకటన
ఇవాళ పార్లమెంటు సమావేశాల ఆరోరోజు కేంద్రం రెండు కీలక బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి ఫార్మా విద్య, పరిశోధనకు సంబంధించిన సవరణ బిల్లు కాగా.. మరొకటి నార్కోటిక్ డ్రగ్స్ చట్టం సవరణ బిల్లు. మరోవైపు నాగాలాండ్లో భద్రతా దళాలు పొరబాటున పౌరుల్ని కాల్చిచంపిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేశారు.
ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే నాగాలాండ్ ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి ఇరు సభల్లోనూ కార్యకలాపాల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీనిపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. జీరో అవర్ లో మొదలైన ఈ రచ్చ అనంతరం కూడా కొనసాగింది. దీంతో లోక్ సభ, రాజ్యసభ కూడా పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ మధ్యలోనే ద నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ సవరణ బిల్లు 2021, ద నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ సవరణ బిల్లు 2021ను కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులపై లోక్ సభలో చర్చించి ఆమోదించారు. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లుల్ని సమర్ధించాయి.,

ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, వైసీపీ తో పాటు పలువురు ఎంపీలు లోక్ సభలో కేంద్రాన్ని పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అమరావతి పాదయాత్రకు వైసీపీ సర్కార్ అడ్డంకులు కల్పిస్తోందని సభ దృష్టికితెచ్చారు.య దీనిపై చర్యలు తీసుకునేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ
మిధున్ రెడ్డి ముందుగా రఘురామరాజుపై సీబీఐ కేసుల దర్యాప్తు వేగంపెంచాలని కోరారు. బీజేపీతో చేరేందుకు ఆయన తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు.
అటు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కాదని తేల్చిచెప్పింది. వాస్తవానికి ప్రాజెక్టు 2022 జూన్ కల్లా పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల కొరత, కరోనా, పునరావాసం, ఇతర సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నట్లు కేంద్రమంత్రి బశ్వేశ్వర తుడు రాజ్యసభకు తెలిపారు. విపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని ఇవాళ కూడా మిగతా విపక్ష సభ్యులు ఛైర్మన్ వెంకయ్యను కోరారు.
ఇవాళ పార్లమెంట్ హైలెట్స్
- ఉదయం పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆరో రోజు ప్రారంభం
- నాగాలాండ్ హత్యలపై చర్చకు విపక్షాల వాయిదా తీర్మానాలు, సభాపతుల తిరస్కరణ
- నాగాలాండ్ హత్యలపై చర్చకు జీరో అవర్ లో విపక్షాల పట్టు
- నాగాలాండ్ ఘటన పొరబాటన్న అమిత్ షా, నెల రోజుల్లో సిట్ దర్యాప్తు చేస్తుందని ప్రకటన
- లోక్ సభలో ద నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ సవరణ బిల్లు 2021
- లోక్ సభలో ద నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ సవరణ బిల్లు 2021,
- విపక్షాల నిరసనలతో పలుమార్లు ఉభయసభల వాయిదాలు
- ఫార్మా, డ్రగ్స్ సవరణ బిల్లులపై లోక్ సభలో కొనసాగుతున్న చర్చ
- పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదంటూ రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్రం
- అమరావతి రైతుల పాదయాత్రను లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ రఘురామరాజు
- రఘురామపై సీబీఐ కేసుల్లో వేగం పెంచాలంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి డిమాండ్












Click it and Unblock the Notifications