రాహుల్ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. గురువారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీనే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.
మరోవైపు, అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ అధికార బీజేపీకి చెందిన సభ్యలు కూడా నిరసనలకు దిగారు. ఇరువర్గాల పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో కొంత ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తోపులాటలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ తోసివేయడం వల్లే వారు గాయపడ్డారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసింది.
అయితే, తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట జరుగుతుంటే.. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా స్పీకర్ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.












Click it and Unblock the Notifications