షాక్: ప్రియాంకకోసం ధర్నా, సీఎం పదవిపై పంకజముండే
న్యూఢిల్లీ/ముంబై: కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పాటు, వరుసగా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆ పార్టీలోని మెజారిటీ నేతలు, కార్యకర్తలు నమ్మకం కోల్పోతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పార్టీ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీని తప్పించి ప్రియాంకకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కళ తప్పింది. దీంతో ప్రియాంక గాంధీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. కార్యాలయం వద్ద గుమికూడిన కార్యకర్తలు.. ప్రియాంక లావో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి రేసులో తాను లేనని దివంగత కేంద్రమంత్రి కుమార్తె పంకజా ముండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. గోపినాథ్ ముండేను అభిమానించే వారు తనను ముఖ్యమంత్రి రేసులో చూడాలని అనుకుంటున్నారని మాత్రమే చెప్పానని తెలిపారు. పార్టీ ఎంపిక చేసిన ముఖ్యమంత్రి అభ్యర్థితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ప్రధాని నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైందన్నారు.
మహారాష్ట్రలో బీజేపీకి ఇది అతి పెద్ద విజయమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తొలిసారి మహారాష్ట్రలో తాము ఒంటరిగా బరిలోకి దిగామన్నారు. శివసేనతో పొత్తు చర్చలు జరిపినప్పుడు 119 సీట్లు ఇస్తామని చెప్పిందని, ఇప్పుడు దాదాపు అదే సంఖ్యకు బీజేపీ సొంతంగా చేరువైందన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటరు బోర్డు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ పైన తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.