గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్32 ప్లేన్లోని 29మంది మరణించినట్లే
చెన్నై: గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32లోని వారంతా మృతి చెందినట్లేనని అధికారులు గురువారం నాడు ప్రకటించారు. రెండున్నర నెలల క్రితం జూలై 22వ తేదీన 29 మంది సిబ్బందితో కూడిన ఏఎన్ 32 తమిళనాడు రాజధాని చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తుండగా హఠాత్తుగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
ఈ విమానం గల్లంతు పైన అధికారులు తాజాగా గురువారం ప్రకటన చేశారు. దానిలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు సమాచారాన్ని అందించారు. వారికి రావాల్సిన బీమా తదితర అంశాలను చూసుకోవాలని చెప్పారు.
జులై 22న విమానం గల్లంతయినప్పటి నుంచి దాదాపు 17 పడవలు, సబ్మెరైన్, 23 విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా దానికి సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఈ విమానానికి అండర్ వాటర్ లొకేటర్ వ్యవస్థ లేనందున దానిని కనిపెట్టడం కష్టమైందని తెలుస్తోంది.