విమానంలో దట్టమైన పొగ: ఆ సమయంలో 141 మంది ప్రయాణికులు..!!
తిరువనంతపురం: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా దట్టమైన పొగ అలముకుంది. పైలెట్ క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీనితో విమానాశ్రయం సిబ్బంది క్షణాల్లో అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులందరినీ కిందికి దించారు. దీనికోసం ప్రత్యేకంగా స్లైడ్స్ను అమర్చారు. విమానాన్ని ఖాళీ చేసే క్రమంలో 14 మందికి గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటన ఈ మధ్యాహ్నం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం నంబర్ బీ737 (వీటీ ఏఎక్స్జెడ్) కేరళలోని కోచికి బయలుదేరడానికి సిద్ధపడిన సమయంలో అందులో దట్టమైన పొగ అలముకుంది.
ఆ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. పొగ వెలువడిన వెంటనే పైలెట్, కోపైలెట్ ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. రెండో ఇంజిన్ నుంచి పొగ వెలువడినట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత మంటలు చెలరేగినట్లు వార్తలొచ్చినప్పటికీ.. అధికారులు దాన్ని ధృవీకరించలేదు.
పొగ వెలువడిన వెంటనే విమానాశ్రయం సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికులు కిందికి దిగడానికి వీలుగా ఎమర్జెన్సీ స్లైడ్స్ను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రయాణికులు, విమానం సిబ్బంది కిందికి దిగారు. ఈ క్రమంలో 14 మంది ప్రయాణికులు గాయపడినట్లు టైమ్స్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది.
కిందికి దిగిన వెంటనే ప్రయాణికులు విమానానికి దూరంగా పరుగులు తీయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదికను అందజేయాలని సూచించింది. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై ఉన్న సమయంలో ఇంజిన్ నంబర్ 2లో పొగ వెలువడినట్లు నిర్ధారించింది.