పటేళ్ల ఆందోళన: అసలు కారణం ఇదీ, శక్తులున్నాయా?
గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం రిజర్వేషన్ల అంశంపై తలపెట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 22 ఏళ్ల హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపునకు మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 12 శాతం ఉన్న పటేల్ సమాజిక వర్గం ప్రజలు రోడ్డెక్కారు. రెండు నెలలు క్రితం వరకు ఎవరికీ తెలియిన్ హార్దిక్ పటేల్కు ఒక్కసారిగా ప్రజల్లో ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది?
ఇప్పటి వరకు ఈ ఆందోళన వల్ల మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. నిన్నటి ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరో ఇద్దరు మృతి చెందారు. పటేళ్ల ఆందోళన హింసాత్మకంగా మారడం వెనుక ఎవరిహస్తమైనా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓబీసీ చేర్చి, విద్యార్ధులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టారు. అసలు నిజంగా పటేళ్ల డిమాండ్లో నిజం ఎంత? గుజరాత్ నుంచి అమెరికా వరకు విస్తరించిన పటేళ్ల ఆర్ధిక పరిస్థితి హఠాత్తుగా తలక్రిందులైందా?
సొంత వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కష్టపడి పనిచేసే పటేళ్ల సామాజిక వర్గ ప్రజలు ఇంటా, బయటా ఎక్కడ కూడా అర్ధికంగా దిగజారిన దాఖలాలు లేవు. అంతెందుకు 1985లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పటేళ్లు ఆందోళన నిర్వహించినప్పుడు కూడా ప్రజల నుంచి ఇంత స్పందన లేదు.
మరి తాజాగా ఇప్పడెందుకు ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గుజరాత్లో రిజర్వేషన్ల కారణంగా గుజరాత్లో ఫార్వర్డ్ కులాలను ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తగ్గిన మాట వాస్తవమే. కాని సొంత వ్యాపారంపైనే బతికే పటేళ్లకు దాని వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. మరెందుకు ఆందోళన బాట పట్టారు?
గుజరాత్లోని ఇతర అగ్ర కులాల వారు కూడా ఇప్పుడు వారి ఆందోళనకు ఎందుకు మద్దతిస్తున్నారు? దీని వెనకు లోతైన కుట్ర ఏమైనా ఉందా? అనే అనుమానాలకు తావిస్తోంది? ఇక హార్దిక్ పటేల్ విషయానికి వస్తే, ప్రధాని నరేంద్రమోడీ లాగానే ముందుగా హిందీలో ఉపన్యాసం ఇచ్చి ఆ తర్వాత గుజరాతీలో మాట్లాడుతున్నాడు.
దానిర్ధం ఏమిటీ? రిజర్వేషన్ల అంశాన్ని యావత్ దేశ వ్యాప్తంగా తన వాణిని ప్రతిధ్వనింప చేయడం కాదా? అంటే అవుననే సమాధానమే వస్తుంది? గుజరాత్లోని పేటల్ సామాజిక వర్గంలో లెవా, కడవా అనే రెండు వర్గాలు ఉన్నప్పటికీ వారెప్పుడూ ఐక్యంగానే ఉన్నారు. వ్యవసాయ రంగంలోనైనా, వ్యాపారం రంగంలోనైనా పటేళ్లు సొంతకాళ్లపైనే నిలబడతారు.
గుజరాత్ మొత్తం 12 శాతంగా ఉన్న పటేళ్లు ఏ మాత్రం ఆర్ధికంగా వెనుకబడి లేరు. ఓబీసీలో ఉన్న కులాలతో పోలిస్తే, ఆర్థికంగా, రాజకీయంగా బాగా ఎదిగిన వాళ్లే. సర్దార్ వల్లభాయ్ పటేల్ను మొదలుకొని గుజరాత్ ముఖ్యమంత్రి బాబూభాయ్ పటేల్, చిమన్ భాయ్ పటేల్, కేశూ భాయ్ పటేల్, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వరకు అందరూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే.
పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనుకుంటే అది ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికిగానీ లేదు. అలాంటప్పుడు రాష్ట్రంలో ఆందోళన చేసి లాభం ఏమిటి? నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దగ్గరికెళ్లి ఆర్జి పెట్టుకోవచ్చుకదా? అలా ఎందుకు చేయడం లేదు?
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఆందోళన ఎందుకు ఊపందుకుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే?