ఉడాయించిన పాట్నా పేలుళ్ల అనుమానితుడు
పాట్నాలో బాంబు పేలుళ్లకు పాల్పడిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ నిర్వాహకులలో ఒకరైన తహసీన్ అక్తర్కు మెహర్ అలామ్ సహాయకుడని పోలీసులు తెలిపారు. అలామ్ చెప్పిన వివరాలతోనే ముజఫర్నగర్లో దాడులు చేసినట్లు వారు తెలిపారు. పేలుళ్లకు ముందు అలామ్ తన సభ్యులతో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జ్లో బస చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాట్నా పేలుళ్ల అనంతరం అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. మరో నలుగురు అనుమానితులను న్యూఢిల్లీ, కోల్కతా, పాట్నా, రాంఛీ నగరాల్లో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ మరో నాయకుడు రియాజ్ భత్కల్కు పాట్నా వరుస పేలుళ్లతో సంబంధంపై ఎన్ఐఏ విభాగం విచారణ చేపట్టింది.
హైదరాబాద్, బీహార్లోని బుద్ధగయాలతోపాటు పాట్నా ర్యాలీలో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ సభ్యులైన రియాజ్ భత్కల్, అతని ముఖ్య అనుచరుడు తహసీన్ అక్తర్ల కోసం ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు తమ సంస్థతో ఆన్లైన్లోనే చర్చలు జరుపుతారని, వారికి పేలుళ్ల కోసం హవాలా ద్వారా నిషేధిత ఐఎం సంస్థ డబ్బులు అందజేస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా మూత్రం చేసేందుకు వెళతానని చెప్పిన మెహర్ అలామ్ ఎన్ఐఏ అధికారుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. మెహర్ అలామ్ తప్పించుకోవడంపై ఎన్ఐఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మెహర్ ఆలంను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతన్ని కాన్పూర్లో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంద.