'నితిన్, కవిత సహా 18 మంది, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు'
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్ రాజకీయ కార్యక్రమం కాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రచారకర్తలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పద్దెనిమిది మందిని నియమించినట్లు చెప్పారు.
కేవలం ప్రభుత్వంతోనే స్వచ్ఛ భారత్ నిర్మాణం సాధ్యం కాదన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలు దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
స్వచ్ఛ భారత్కు సంబంధించి సినీ నటులు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక గురువులు, స్వచ్ఛంధ సంస్థలతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తేనే మహాత్ముడు కలలు కన్న స్వచ్ఛభారత్ ఏర్పడుతుంది.
స్వచ్ఛ భారత్ ప్రచారకర్తల్లో పవన్ కళ్యాణ్తో పాటు హీరో నితిన్, తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, రామేశ్వర రావు, జీవీకే రెడ్డి, కోనేరు హంపి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అక్కినేని అమల, సుద్దాల అశోక్ తేజ, డాక్టర్ జీఎన్ రావు, ఎంపీ గల్లా జయదేవ్, పుల్లెల గోపీచంద్, మోహన్ రెడ్డి, చౌదరి, జీవీకే, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.