రూ.600 కోట్లు చెల్లిస్తారా, జైలుకెళ్తారా: సుబ్రతా రాయ్కి సుప్రీం హెచ్చరిక
రూ.600 కోట్లు చెల్లించాలని లేదంటే జైలు జీవితం గడపాలని సహారా గ్రూప్ సంస్థల యజమాని సుబ్రతా రాయ్కు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది.
న్యూఢిల్లీ: రూ.600 కోట్లు చెల్లించాలని లేదంటే జైలు జీవితం గడపాలని సహారా గ్రూప్ సంస్థల యజమాని సుబ్రతా రాయ్కు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఆయన పెరోల్ పొడిగింపుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
గురువారం సుబ్రతా రాయ్ కేసును విచారించిన సుప్రీం కోర్టు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆయన రూ.600 కోట్లు సెబీకి చెల్లించాలని చెప్పింది. ఆ తేదీలోపు చెల్లించలేకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఆర్థిక మందగమనం, పెద్ద నోట్ల రద్దు వల్ల రూ.600 కోట్లు చెల్లించేందుకు సమయం పొడిగించాలని సుబ్రతా రాయ్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. లండన్ బ్యాంకులో జమ అయిన రూ.285 కోట్లను సెబికి బదిలీ చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటి వరకు ఏ నిందితుడికీ ఇవ్వనంత అవకాశం సుబ్రతా రాయ్కి ఇచ్చినట్లు కోర్టు చెప్పింది.
పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో సుబ్రతారాయ్ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం గత ఏడాది మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి కోర్టు పెరోల్ పొడిగిస్తుండటంతో బయటే ఉంటున్నారు. సెబీకి రూ.500కోట్లు చెల్లించే ఒప్పందంతో కోర్టు గతంలో పెరోల్ పొడిగించింది.