ఎన్డీఏకు గుడ్బై చెప్పిన పీసీ థామస్: యూడీఎఫ్ భాగస్వామ పార్టీలో తన పార్టీ విలీనం
తిరువనంతపురం: బీజేపీ నేతృత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కేరళ కాంగ్రెస్(థామస్) ఆ కూటమి నుంచి బయటికి వస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కొద్ది రోజుల్లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
షాకింగ్: బీజేపీ ఎంపీ ఆత్మహత్య - ఢిల్లీలోని ఇంట్లో వేలాడుతూ హిమాచల్ నేత -పార్లమెంటరీ భేటీ వాయిదా
ఎన్డీఏ హయాంలో గతంలో థామస్ మంత్రిగా పనిచేయడం గమనార్హం. కాగా, ప్రస్తుతం థామస్ తన పార్టీని పీజే జోసెఫ్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ గ్రూప్లో చేరతానని చెప్పారు. తనకు టికెట్ కేటాయించకుండా బీజేపీ అవమానించిందని థామస్ పేర్కొన్నారు.
తమ పార్టీకి నాలుగు సీట్లు కావాలని కోరితే బీజేపీ అందుకు నిరాకరించింది. కేరళ కాంగ్రెస్ నేత జోస్ కే మణి పోటీ చేస్తున్న పాలా నియోజకవర్గం నుంచి తనను పోటీ చేయించాలని చూసిందని చెప్పారు. నా వ్యక్తి కారణాల వల్ల నేను అక్కడ్నుంచి పోటీ చేయలేనని బీజేపీకి చెప్పా. ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి తాము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం అని థామస్ వివరించారు.
యూడీఎఫ్కు భాగస్వామ్య పక్షంగా ఉన్న జోసెఫ్ కేరళ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానని థామస్ తెలిపారు. కేరళ కాంగ్రెస్ అనే పేరు మాత్రం నాతోనే ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పేరు అవసరం లేదు. యూడీఎఫ్ అభ్యర్థులుగా పది మంది జోసెఫ్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. వారంతా కేరళ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉంటారని చెప్పారు.
రెండు ఆకుల పార్టీ గుర్తు కోసం పోరాటం చేసి ఓడిపోయిన థామస్.. చివరకు కేరళ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు. ఆ పార్టీ గుర్తు 'కేరళ కాంగ్రెస్ ఎం'కు కేటాయించడం జరిగింది. జోసెఫ్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఎం ఎల్డీఎఫ్ భాగస్వామిగా ఉంది. కేరళ కాంగ్రెస్ టైటిల్ను కలిగి ఉన్న థామస్తో జోసెఫ్ విలీనం కాకపోతే, ఈ మాజీ మంత్రి తన అభ్యర్థులను స్వతంత్రులుగా నిలబెట్టవలసి వస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీని విలీనం చేయడం జరిగింది.
కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండగా. ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో శ్రీధరన్ సహా పలువురు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కొంత ఉత్సాహం మీద ఉన్నట్లు కనిపిస్తోంది. మే 2న ఫలితాల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందో తేలనుంది.