peegate : ఎయిర్ ఇండియాపై డీజీసీఏ తీవ్ర చర్యలు- 30 లక్షలు ఫైన్- పైలట్ సస్పెండ్..
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన వ్యవహారంపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఎయిర్ ఇండియా కూడా ఈ ఘటనపై క్షమాపణలు చెప్పడమే కాకుండా తమ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో డీజీసీఏ ఇవాళ ఎయిర్ ఇండియాపై చర్యలకు దిగింది.
ప్రయాణికుడి మూత్రవిసర్జన వ్యవహారంలో ఎయిర్ ఇండియా స్పందనపై తీవ్రంగా స్పందించిన డీజీసీఏ.. విమానయాన సంస్ధకు 30 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఎయిర్ లైన్స్ఇన్-ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్కి 3 లక్షల జరిమానా విధించింది. అలాగే పైలట్ ఇన్ కమాండ్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా కూడా హుందాగానే స్పందించింది.
జరిమానా విధించడంపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంలో జరిగిన లోపాల్ని గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నట్లు తెలిపింది. అలాగే.. సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. వికృత ప్రయాణీకులకు సంబంధించిన సంఘటనలను హ్యండిల్ చేసే విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా తమప్రయాణీకుల భద్రత , శ్రేయస్సుకు కట్టుబడి ఉందని పేర్కొంది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించింది.