Pegasus: మోదీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్-ఎవరి బాణీలకు స్టెప్పులేస్తున్నారు-అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
భారత్లో 'పెగాసస్' స్పై వేర్ ఉదంతం తీవ్ర సంచలనం రేపుతోంది.దేశంలోని ఆయా రంగాల ప్రముఖల ఫోన్లను ఈ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ ఉదంతం తెరపైకి రావడం గమనార్హం. కేంద్రమంత్రులు,జర్నలిస్టులు,సామాజిక కార్యకర్తలు,వ్యాపార వేత్తలు,ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వస్తుండటంతో దీనిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని,ప్రధాని మోదీపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు కేంద్రం మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తోంది. ఉద్దేశపూర్వకంగా కేవలం సంచలనం కోసమే ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడుతోంది.తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై స్పందించారు.
అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
'ది వైర్' మీడియా సంస్థ ఈ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అమిత్ షా దీనిపై మాట్లాడుతూ... 'అడ్డుపడేవారి కోసం ఆటంకం సృష్టించేవారు ప్రచురించిన రిపోర్ట్ ఇది...' అని విమర్శించారు. ఆ ఆటంకం సృష్టించే గ్లోబల్ సంస్థలకు భారత్ పురోగతి చెందడం ఇష్టం లేదన్నారు. ఆ అడ్డుపడేవారు కూడా భారత్ పురోగతి ఇష్టపడనివారేనని... ఇక్కడి పొలిటికల్ ప్లేయర్సేనని వ్యాఖ్యానించారు.ఆ కథనం ప్రచురితమైన సందర్భాన్ని గమనించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇలాంటి కథనాలను తెర పైకి తీసుకురావడాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారతీయులు దీన్ని చక్కగా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు.

భారత్ను అవమానించేందుకే : అమిత్ షా
ప్రపంచ వేదికపై భారత్ను అవమానించేందుకే ఇలాంటి పాత కథనాలను తీసుకొస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఎవరి బాణీలకు మీరు స్టెప్పులు వేస్తున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.ఎంతమంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా భారత ప్రగతిని అడ్డుకోలేరని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలపై భారత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం,యువత,మహిళలు,వెనుకబడిన వర్గాలకు సంబంధించి కీలక బిల్లులపై చర్చకు రావాల్సి ఉందన్నారు.

మోదీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్
ప్రభుత్వాలకు మాత్రమే ఇలాంటి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఈ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్రపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని.. కేంద్రమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 'ప్రధాని,కేంద్ర హోంమంత్రి ఇద్దరూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,జర్నలిస్టులు,ఆఖరికి కేబినెట్ మంత్రులపై నిఘా పెట్టారు. దీనిపై విచారణ జరగాలి. అంతకుముందు,అమిత్ షా రాజీనామా చేయాలి. మోదీపై విచారణ చేపట్టాలి. అని కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.

పార్లమెంటులో కేంద్రమంత్రి రియాక్షన్
ఇదే వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో స్పందించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర అని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇలాంటి కథనాలు కాకతాళీయం కాదని అన్నారు. ఎంతో పటిష్ఠమైన చట్టాలు,న్యాయ వ్యవస్థ ఉన్న దేశంలో అనధికార సంస్థలు లేదా వ్యక్తులతో అక్రమ పద్దతిలో నిఘా అసాధ్యమన్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని... అవన్నీ నిరాధారమైనవిగా తేలాయని పేర్కన్నారు. కేవలం సంచలనాల కోసమే ఇలాంటి కథనాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications