రాజకీయ పార్టీలకు షాక్: ఆ విషయాన్ని ఓటర్లకు తెలిసేలా బహిరంగ పర్చాలి: ఈసీ
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కొద్దిసేపటి కిందటే ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఈ మేరకు దేశ రాజధానిలో ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలను ఎదుర్కొంటోన్న రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర గల అభ్యర్థుల వివరాలను ఆయా పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. దీన్ని తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. నేర చరిత్ర గల వారిని ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందనే విషయంపై కూడా రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నేర చరితులను ఎన్నికల్లో నిలబెట్టిన ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందుపర్చాలని అన్నారు.
ఆ అభ్యర్థిపై ఎన్ని క్రిమినల్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనేది వెల్లడించాలని, ఏ ప్రయోజనంతో వారిని నిలబెట్టారో ఓటర్లకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలను నివారించడానికి సీవిజిల్ యాప్ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటర్ కూడా తాను వినియోగించే స్మార్ట్ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అయిదు రాష్ట్రాల్లో విడతలవారీగా పోలింగ్ను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పోలింగ్ నిర్వహించేలా అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని వివరించారు. షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సుశీల్ చంద్ర తెలిపారు. మోడల కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని, అవి వెంటనే అమలయ్యేలా చూస్తామనీ అన్నారు.