ప్రభుత్వ ఉద్యోగులకు.. కేంద్రం గుడ్ న్యూస్
ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెన్షన్ ఫండ్ నిబంధనలను సరళతరం చేసింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెన్షన్ ఫండ్ నిబంధనలను సరళతరం చేసింది. కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులు తమ పెన్షన్ ఫండ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.
12 నెలల చెల్లింపును లేదా జమ చేసిన మొత్తంలో నాలుగింట మూడు వంతులు.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఇప్పటి వరకు కేవలం మూడు నెలల చెల్లింపులను లేదా సగం మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది.
ఇప్పుడు సరళతరం చేసిన ఈ నిబంధనలతో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు నగదును విత్ డ్రా చేసుకునేందుకు అర్హులవుతారు. అంతకుముందు ఈ సర్వీసు పరిమితి కూడా 15 ఏళ్ల వరకు ఉండేది.
చదువులకు, అనారోగ్య ఖర్చులకు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనడానికి పెన్షన్ ఫండ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇకమీదట ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ల కోసం కూడా ఉద్యోగులు పెన్షన్ ఫండ్ నుండి నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
అలాగే గృహ రుణల తిరిగి చెల్లింపులకు, భూమి కొనుగోలుకు, ప్రస్తుత ఇంటి ఆధునీకరణ ఖర్చులకు ఇప్పటి వరకు ఉన్న విత్ డ్రా పరిమితిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచినట్లు తెలిసింది. కొత్త నిబంధనల ప్రకారం.. కారు రుణాల తిరిగి చెల్లింపులకు, కారు మరమ్మతులకు కూడా పెన్షన్ ఫండ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.