మస్ట్ రీడ్: గోరఖ్ పూర్ వైద్యుడు డాక్టర్ ఖఫీల్ ఖాన్ను ఆదుకునేందుకు విరాళాలు
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి గుర్తున్నాడా..? ఈయనే డాక్టర్ ఖఫీల్ ఖాన్.. ఒక వేళ గుర్తుకు లేకపోతే గుర్తు చేస్తాం. గతేడాది ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక చాలా మంది చిన్నారులు మృతి చెందారు. ఇది జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం అని నాడు ప్రజాసంఘాలు ధ్వజమెత్తాయి. ఇక ఈ ఘటనలో ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలని భావించిన సర్కార్ ఆ ఆస్పత్రిలో పనిచేసే పిల్లల వైద్యులు డాక్టర్ ఖఫీల్ ఖాన్పై వేటు వేసింది. అతన్ని జైలుకు పంపింది. ఇస సెప్టెంబర్ 2017 నుంచి జైలులోనే ఉన్న డాక్టర్ ఖఫీల్కు ఈ ఏడాది ఏప్రిల్లో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చివరి నిమిషంలో చిన్నారులకు ఆక్సిజన్ అందించి కొందరి ప్రాణాలను నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి దేశం దృష్టిలో డాక్టర్ ఖఫీల్ హీరోగా నిలువగా... యూపీ సర్కార్ మాత్రం ఆయన్ను దోషిగా నిలబెట్టింది. అంతేకాదు అవినీతి ఆరోపణలు అంటగట్టి, క్రిమినల్ కేసులు ఈ డాక్టర్పై నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఖఫీల్ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలతో పాటు మరికొన్ని సమస్యలు వెంటాడాయి. ఈ ఏడాది జూన్లో ఖఫీల్ తమ్ముడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీనిపై ఖఫీల్ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇందుకోసం ఖఫీల్ తన ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పటికే డాక్టర్ ఖఫీల్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాదు... సొంతంగా ప్రాక్టీస్ కూడా నిర్వహించరాదని హుకూం జారీ చేసింది.
ప్రభుత్వం ఖఫీల్ను పట్టించుకోక పోయినా... ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు డాక్టర్ ఖఫీల్ కుటుంబానికి అండగా నిలిచారు. క్రౌడ్ న్యూసింగ్ డాట్ కామ్ అనే స్వతంత్ర ప్రచార సంస్థ డాక్టర్ ఖఫీల్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల గురించి వెలుగులోకి తీసుకురావడంతో ప్రజలు స్వచ్చందంగా తలో చేయి వేసి ఖఫీల్ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.6లక్షలు రూపాయలు విరాళంగా వచ్చాయి. అయితే రూ. 20 లక్షలుగా టార్గెట్గా పెట్టుకున్నట్లు క్రాడ్ న్యూసింగ్ సంస్థ తెలిపింది. "ఒక్క ఏడాదిలోనే ఈ డాక్టర్ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు" అనే పేరుతో సంస్థ విరాళాలను సేకరిస్తోంది.
" ఈ సందేశం మనందరి కోసం: ప్రజాస్వామ్యంలో ఒక మనిషిపై ఇలా నిందలు మోపి కష్టపెట్టడం సరికాదు. సామాన్య పౌరులు తిరగబడాలి.. లేదా డాక్టర్ ఖలీఫ్ ఎలాగైతే మానసిక హింసకు గురవుతున్నాడో అలా బతికేందుకు సిద్ధపడాలి. భారత పౌరులుగా ఇలాంటి వ్యక్తులను ఆదుకునేందుకు ముందుకు రావాలి"అని తమ క్యాంపెయిన్ పేజ్ మీద రాసుకుంది న్యూసింగ్ డాట్ కామ్. అంతేకాదు సేకరించిన విరాళాలు ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలిపింది. డాక్టర్ ఖఫీల్ ఖాన్కు ఉన్న అప్పులు తీర్చేందుకు, న్యాయపరమైన పోరుకు అవసరమయ్యే ఖర్చుకు, వైద్యానికి, డాక్టర్ ఖఫీల్కు ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా పర్యటించి చెప్పేందుకు ఈ డబ్బులు ఖర్చు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఇదిలా ఉంటే విరాళాలు బాగా వస్తే చిన్నారుల కోసం 20 పడకల ఆస్పత్రిని నిర్మించాలని డాక్టర్ ఖఫీల్ ఖాన్ భావిస్తున్నారు. మనం కూడా ఖఫీల్ ఖాన్కు ఆల్ దిబెస్ట్ చెప్పేద్దాం...