మహనీయుల విగ్రహాల విధ్వంసం! తల లేకుండా చేశారు!
చెన్నై: ఎన్నికల వేళ మరోసారి విగ్రహాల విధ్వంసాల ఘటన పునావృతమైంది. ఇదివరకు త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన అనంతరం వరుసగా విగ్రహాలపై తమ ప్రతాపం చూపారు వివిధ పార్టీల నాయకులు. గత ఏడాది ఇలాంటి సంఘటనలే తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లల్లో నమోదయ్యాయి. కొన్ని నెలల పాటు సద్దు మణిగిన ఆ తరహా విధ్వంసకాండ మళ్లీ తెరమీదికి వచ్చింది.
తాజాగా- తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో విగ్రహ విధ్వంసం ఘటన చోటు చేసుకుంది. ద్రవిడుల ఆరాధ్యుడు, సిద్ధాంతకర్తగా పేరున్న పెరియార్ రామస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం తలను పగులగొట్టారు. పుదుక్కోట్టై జిల్లాలోని అనంతంగిలో ఈ ఘటన సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

పెరియార్ రామస్వామి విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడం కొత్తేమీ కాదు. గత ఏడాది మార్చిలో తమిళనాడులోని రాయవెల్లూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఉదంతం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో భారతీయ జనతాపార్టీ సానుభూతిపరులను కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపైనా దాడులు చోటు చేసుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కొంతమంది దుండగులు అంబేద్కర్ విగ్రహానికి ఎర్రరంగును చల్లారు. గుజరాత్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా కొంతమంది ధ్వంసం చేసిన ఉదంతం గత ఏడాది చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications