హైదరాబాద్లో నూటొక్కటి: పెట్రోల్ బాటలో డీజిల్..రూ.100 ప్లస్: అక్కడ రూ.108
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. పెట్రో ఉత్పత్తుల రేట్లను మరోసారి పెంచేశాయి. శనివారం పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు 24 గంటల తరువాత కొరడా ఝుళింపించాయి. రేట్లను పెంచడంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. పలు చోట్ల డీజిల్ కూడా 100 రూపాయల మార్క్ను దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపు కాదు.
పెట్రోల్, డీజిల్పై ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 29, డీజిల్ 28 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.97.22, డీజిల్ 87.97 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 103 మార్క్ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.103.36 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 95.44కు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 98.40, డీజిల్ ధర రూ.92.58, కోల్కతలో పెట్రోల్ రూ.97.12 పైసలు, డీజిల్ ధర రూ.90.82 పైసలకు చేరింది.
హైదరాబాద్లో నూటొక్కటి..
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.04 పైసలుగా నమోదైంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.95.89 పైసలు. ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసింది. భోపాల్లో పెట్రోల్-105.43, డీజిల్-96.65 రూపాయలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.100.47, డీజిల్ 95.89, పాట్నాలో పెట్రోల్ రూ.99.28 పైసలు, డీజిల్ రూ.93.30 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.94.42, డీజిల్ రూ.88.38 పైసలు పలుకుతోంది.
డీజిల్ రేటు దిమ్మ తిరిగేలా..
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో డీజిల్ రేటు 101 రూపాయలను దాటేసింది. అక్కడ డీజిల్ లీటర్ ఒక్కింటికి 101.12 పైసలకు చేరింది. పెట్రోల్ కొత్త రికార్డు నెలకొల్పింది. రూ.108 రూపాయను దాటింది. పెట్రోల్ లీటర్ 108.37 పైసలుగా నమోదైంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
Recommended Video
ఏపీ, తెలంగాణల్లోనూ
ముంబైలో 103 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్వారా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల 102 రూపాయలను దాటింది. హైదరాబాద్లో డీజిల్ రేటు కూడా వంద రూపాయల మార్క్కు చేరువ అవుతోంది. డీజిల్ రేట్ల విషయంలో విశాఖపట్నం, విజయవాడ సహా ఏపీలోని అనేక నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.