భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఎవడబ్బ సొమ్మని..!
న్యూఢిల్లీ: పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగాయి. గత రెండుసార్లు ధరలు కొంచెం మాత్రమే పెరిగాయి. ఈసారి మాత్రం ఎక్కువ పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోల్ పైన లీటర్కు రూ.3.38 పైసలు, డీజిల్పై లీటర్కు రూ.2.67 పైసలు పెరిగింది.
వాహనదారుల మండిపాటు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పైన వాహనదారులు మండిపడుతున్నారు. పెట్రోలు ధరలు తగ్గించినప్పుడు పైసల్లో తగ్గించి, పెంచినప్పుడు మాత్రం రూపాయల్లో పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ఇలా చేస్తున్నారని పెట్రోలియం సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం బిజెపి సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సామాజిక అనుసంధాన వేదిక ద్వారా.. లీటర్ పెట్రోలు 15 రూపాయలకే లభిస్తున్నప్పటికీ మన దేశంలో ట్యాక్సులు, ఇతర కారణాలతో లీటర్కు రూ.60కి అమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గోవాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ లీటర్ పెట్రోల్ రూ.60కు పెరగకుండా చూస్తామని బిజెపి హామీ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ధరలు పెరిగనప్పుడు గోవాలో పెంచలేదు. కేవలం రూ.60కే లీటర్ పెట్రోలును విక్రయిస్తున్నారు. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో గోవా ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయనుందనే చర్చ సాగుతోంది.