పెట్రోల్ బంకుల్లో కార్డు చెల్లింపులు జనవరి 13 వరకు ఒకే
పెట్రోల్ బంకుల యాజమాన్యాల తాజా నిర్ణయంతో మరో కొద్ది రోజులు వాహన వినియోగదారులకు వెసులుబాటు లభించింది.
న్యూఢిల్లీ: పెట్రోల్ బంకుల యాజమాన్యాల తాజా నిర్ణయంతో మరో కొద్ది రోజులు వాహన వినియోగదారులకు వెసులుబాటు లభించింది. పెట్రోలు బంకుల వద్ద డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఇంధనం తీసుకుంటే సేవా రుసుము వసూలు చేయాలన్న ఉత్తర్వులను ఆదివారం అర్ధరాత్రి బ్యాంకులు తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నాయి. నగదు చెల్లిస్తే తప్ప కార్డుల ద్వారా పెట్రోల్/డీజిల్ ఇచ్చేది లేదని బంకుల యజమానులు హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కాగా, బ్యాంకులు సానుకూలంగా వ్యవహరించడంతో కార్డులు స్వీకరించరాదన్న తమ ఆందోళనను జనవరి 13 వరకు వాయిదా వేసినట్టు డీలర్లు తెలిపారు. కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు విధించే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా బ్యాంకులు తమపైనే వేయడాన్ని బంకుల యజమానులు తప్పుపట్టారు.
ఇందుకు నిరసనగా ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కార్డులను అనుమతించేది లేదని ప్రకటించారు. దీనిపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సంబంధిత వర్గాలతో అత్యవసరంగా చర్చలు జరిపింది. తమ నిర్ణయాన్ని 4-5 రోజుల వరకు వాయిదా వేయడానికి బ్యాంకులు అంగీకరించాయని ఇంధనశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ లోగా బంకుల యజమానులకు ఏ విధంగా పరిహారం చెల్లించాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అసలు వివాదం ఎక్కడొచ్చింది?
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇంధన కొనుగోళ్లపై ప్రభుత్వం ఎండీఆర్ను రద్దు చేసింది. అయితే 50 రోజుల గడువు ముగిసినందున ఎండీఆర్ కింద 1 శాతం లావాదేవీల సేవా రుసుము వసూలు చేయాలని బ్యాంకులు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నాయి. సేవా రుసుము వసూలు చేస్తామని స్టేటు బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు సమాచారం ఇచ్చాయని పెట్రోలు బంకుల యజమానులు తెలిపారు.
'జనవరి 9 నుంచి క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై 1 శాతం రుసుం విధిస్తాం. డెబిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై 0.25 శాతం నుంచి 1 శాతం రుసుమును మీ నుంచి వసూలు చేస్తాం. అది మా ఖాతాలో జమ చేసుకుంటామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాకు సమాచారమిచ్చింది' అని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. కాగా, సోమవారం నుంచి సేవా రుసుము వసూలు చేయాలని తమ బ్యాంకు ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.