PFI: ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను నిషేధించిన కేంద్రం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని అనుబంధ సంస్థలు 'చట్టవిరుద్ధమైన సంస్థలు' అని కేంద్రం ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
పీఎఫ్ఐ "రహస్య ఎజెండాను అమలుచేస్తూ ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తోందని" ఈ నోటీసులో పేర్కొంది.
పీఎఫ్పై, దాని అనుబంధ సంస్థలు లేదా సంబంధిత సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. అవి ఒక రహస్య ఎజెండాను అమలుచేస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇది దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు కలిగిస్తుంది.. ప్రజా శాంతిని, సామరస్యానికి ఆంటకం కలిగిస్తుంది. దేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది" అని నోటిఫికేషన్లో రాసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
అంతే కాకుండా, "పీఎఫ్ఐకి క్రిమినల్, ఉగ్రవాద కేసులతో సంబంధం ఉంది. ఇది దేశ రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరుస్తుంది. దేశం బయటి నుంచి నిధులు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు.
గతంలో భారతదేశం, బంగ్లాదేశ్లలో నిషేధం విధించిన రెండు సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది.
పీఎఫ్ఐ అంటే ఏంటి?
పీఎఫ్ఐ 2006లో ఏర్పాటైంది. తమది ఒక సామాజిక, స్వచ్ఛంద సంస్థ అని, పేదలు, అణగారిక వర్గాల కోసం సేవలు అందించడం, దోపిడీపై పోరాడటం తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతోంది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం, కేరళకు చెందిన వివాదాస్పద నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ (ఎన్డీఎఫ్) ఏర్పాటైంది. దీనితోపాటు మరికొన్ని దక్షిణ భారత సంస్థలను కలిపి పీఎఫ్ఐను ఏర్పాటుచేశారు. మరికొన్ని సంస్థలు కూడా కలవడంతో పీఎఫ్ఐ పరిధి కూడా విస్తరించింది.
ప్రస్తుతం కేరళ, కర్నాటకల్లో పీఎఫ్ఐకు ప్రాతినిధ్యం ఉంది. దాదాపు 20కిపైగా రాష్ట్రాల్లో వేల మంది కార్యకర్తలు ఉన్నారు.
కాగా 2008లో ఏర్పాటైన జాతీయ దర్యాప్తు సంస్థ పీఎఫ్ఐ కార్యకలాపాలను గమనించడం ప్రారంభించింది.
ఎర్నాకుళానికి చెందిన మలయాళ ప్రొఫెసర్ టీజే జోసెఫ్పై దాడి కేసును కూడా 2011లో ఎన్ఐఏకు అప్పగించారు.
'సిమి’కి మరో రూపం
నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి)కి పీఎఫ్ఐ మరో రూపమని ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.
'ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించి, భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో 'సిమి' ఒకటి. 2001లో దీనిని ప్రభుత్వం నిషేధించింది.
ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 'ఇండియన్ ముజాహిదీన్'తో సిమి కి సంబంధాలు ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ అప్పట్లో ఇండియన్ ముజాహిదీన్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
పీఎఫ్ఐ, సిమి మధ్య సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి. చాలామంది సిమి సభ్యులు పీఎఫ్ఐలో యాక్టివ్గా ఉంటుంటారు. అలాంటి వ్యక్తులలో ప్రొఫెసర్ కోయా ఒకరు.
అయితే, 1981లోనే సిమి తో సంబంధాలు తెగిపోయాయని, 1993లో తాను ఎన్డీఎఫ్ను స్థాపించానని ప్రొఫెసర్ కోయా అన్నారు. పీఎఫ్ఐ నిర్మాణంలో పాల్గొన్న సంస్థల్లో ఒకటి ఎన్డీఎఫ్
ప్రభుత్వం సిమి ని నిషేధించినందున దాని స్థానంలో 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' స్థాపించారని, అందుకే చాలామంది సిమి కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉంటారని చాలామంది నమ్ముతారు.
పీఎఫ్ఐ ఎందుకు వివాదాస్పదమైంది?
సంస్థ వెబ్సైట్లో పేర్కొన్న మిషన్ స్టేట్మెంట్ ప్రకారం.. ''స్వేచ్ఛ, న్యాయం, భద్రతకు సంబంధించి అందరికీ సమాన హక్కులు అందేలా చూడటం’’తమ విధి అని పీఎఫ్ఐ చెబుతోంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలకు హక్కులు అందేలా చూసేందుకు ఆర్థిక పరమైన విధానాల్లో మార్పులు చేయడం అవసరమని సంస్థ వివరిస్తోంది.
అయితే, సంస్థతోపాటు సంస్థ సభ్యులపై ప్రభుత్వం వరుస అభియోగాలు మోపుతోంది. రాజ్యద్రోహం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, భారత్ను అస్థిర పరచడం లాంటి ఆరోపణలను సంస్థపై ఉన్నాయి.
గత జూన్లో రాజస్థాన్లో ఒక హిందూ వ్యక్తి తల నరికిన కేసులో సంస్థ సభ్యుల ప్రమేయముందని పోలీసులు ఆరోపణలు మోపారు.
కొన్ని నెలల క్రితం భారత్ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామంటూ చెప్పే ఒక పత్రాన్ని బిహార్లో సంస్థ పంచినట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఆ పత్రంతో తమకు సంబంధంలేదని సంస్థ చెబుతోంది.
పీఎఫ్ఐపై వస్తున్న ప్రధాన ఆరోపణల్లో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ – స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)తో సంబంధాలు కూడా ఒకటి. మరో నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్తోనూ పీఎఫ్ఐకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
గత ఏప్రిల్లోనే..
గత ఏప్రిల్లోనే పీఎఫ్ఐను నిషేధించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సుప్రీం కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
''ఈ విషయంలో ఎన్ఐఏ నుంచి కేంద్ర హోం శాఖకు ప్రతిపాదన వచ్చింది, అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు''అని ఆ కథనంలో పేర్కొన్నారు.
పీఎఫ్ఐను నిషేధించే అంశంపై ప్రొఫెసర్ కోయ మాట్లాడుతూ.. ''నిషేధం అనేది పూర్తి రాజకీయ నిర్ణయం. అలా నిషేధించడంలో ఎలాంటి అర్థమూ లేదు. గతంలో కమ్యూనిస్టు పార్టీని, ఆరెస్సెస్లనూ ఇలానే బ్యాన్ చేశారు. కానీ, తర్వాత ఏమైంది''అని అన్నారు. పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications