భారత్లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న సమయంలోనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, వీటికి తోడు ఆక్సిజన్ మరణాలు రోజురోజుకూ పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతున్నది. అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఫార్మా అధినేత అదర్ పూనావాలాకు బడా నేతల నుంచి బెదిరింపులు రావడంతో ఆయన ఇండియా వదిలేసి లండన్ కు మకాం మార్చేయడం, అందరికీ సరిపడా వ్యాక్సిన్లు జులై నాటికికానీ సాధ్యంకాదని కుండబద్దలుకొట్టడం తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచంలోనే బెస్ట్ వ్యాక్సిన్ గా మన్ననలు పొందిన ఫైజర్.. భారత్ కు సంబంధించి సంచలన అడుగులు వేసింది..

చరిత్రలోనే అతిపెద్ద సాయం
భారత్ లో రెండో దశ కరోనా వ్యాప్తి అల్లకల్లోలంగా మారినవేళ అమెరికాకు చెందిన బహుళజాతి ఫార్మా సంస్థ ఫైజర్ కీలక చర్యకు ఉపక్రమించింది. కొవిడ్ పై పోరులో భారత్ కు భారీ సాయం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. 700 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 510 కోట్లు) విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, యూరప్, ఆసియాలోని ఇతర దేశాల నుంచి భారత్కు అందించనున్నట్లు ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు. ఫైజర్ సంస్థ చరిత్రలోనే ఇది అతి పెద్ద విరాళం కావడం విశేషం.

ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఫోకస్..
తాము ప్రకటించిన సహాయం అతి త్వరగా భారత్కు అందేలా చర్యలు చేపట్టినట్లు ఫైజర్ సీఈవో బోర్లా తెలిపారు. ఫైజర్ పంపబోయే కొవిడ్ సంబంధిత మందులను ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్-19 బాధితులందరికీ ఉచితంగా అందుబాటులోకి తేనున్నారు. వీటిని అవసరమైన చోటుకు వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. భారీ సహాయం ప్రకటనతోపాటే భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంపైనా ఈసీవో అల్బర్ట్ బోర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. బయోఎన్టెక్తో కలిసి ఫైజర్ రూపొందించిన కరోనా టీకా వినియోగానికి భారత్లో అనుమతులు లభించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు బోర్లా తెలిపారు.
Recommended Video

భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ ఎప్పుడు?
అమెరికా సహా యూరప్ దేశాలన్నీ విశ్వసనీయంగా భావిస్తోన్న ఫైజర్ టీకాలను భారత్ లోకి అనుమతించే విషయంలో మోదీ సర్కార్ తాత్సారం చేస్తుండటం వివాదాస్పదమైంది. రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతిచ్చి, ఆయా కంపెనీల అధినేతలే ధరలు నిర్ణయించుకోవడం, మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నా సరిపడా డోసులు అందించకపోగా, విదేశాలకు వెళ్లిపోయి, బెదిరింపుల ఆరోపణలు చేస్తుండటం చర్చనీయాంశమైంది.
రెండో దశ విజృంభణకు ముందు భారత ప్రభుత్వం ఫైజర్ దరఖాస్తును తిరస్కరించింది. భారత్లో క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరిందికానీ అందుకు అవసరమైన అనుమతులు మాత్రం ఇవ్వలేదు. 95 శాతం సమర్థత కలిగిన ఫైజర్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ.2,725గా ఉంది. ఇప్పటికే మూడో వ్యాక్సిన్(రష్యా తయారీ స్ఫూత్రిక్-వీ)కి భారత్ లో ఆమోదం లభించగా, ఫైజర్ ను కూడా అనుమతిస్తే పూనావాలా చెబుతున్నట్లు జూన్ నాటికి కొంతైనా ఒత్తిడిని నిర్వహించే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలోనూ సేఫ్ అని ఆ సంస్థ చెబుతున్నప్పటికీ, కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications