గ్లోబల్ టెండర్లు బోల్తా-షాకిస్తున్న కంపెనీలు-ఇలాగైతే వ్యాక్సినేషన్ సాగినట్లే-కేంద్రంపై భగ్గుమన్న ఢిల్లీ
రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరతకు గ్లోబల్ టెండర్లే పరిష్కార మార్గమని ప్రభుత్వాలు భావించాయి. అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా కంపెనీల నుంచే వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవాలన్న కేంద్రం సూచన మేరకు పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచాయి.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,పంజాబ్,ఢిల్లీ,మహారాష్ట్ర ఇలా చాలానే రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచాయి.కానీ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రాలు నేరుగా కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం సాధ్యపడేలా కనిపించట్లేదు. పంజాబ్,ఢిల్లీ ప్రభుత్వాల గ్లోబల్ టెండర్లను మోడెర్నా,ఫైజర్ కంపెనీలు తిరస్కరించడం ఇందుకు అద్దం పడుతోంది.
ఢిల్లీ సర్కార్కు షాక్...
కరోనా వ్యాక్సిన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్లను మోడెర్నా,ఫైజర్ కంపెనీలు తిరస్కరించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వ్యాక్సిన్ డోసులను నేరుగా రాష్ట్రాలకు విక్రయించమని... తాము కేంద్రంతోనే డీల్ చేస్తామని ఆ కంపెనీలు చెప్పాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమే అంతర్జాతీయ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలక పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
కేంద్రంపై భగ్గుమన్న ఢిల్లీ సర్కార్...
'మోడెర్నా,ఫైజర్,జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను మేము సంప్రదించాం. ఆ కంపెనీలు కేంద్రంతో టచ్లో ఉన్నట్లు చెప్పాయి. అంతేకాదు,రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వలేమని వెల్లడించాయి. రాష్ట్రాలను గ్లోబల్ టెండర్లకు వెళ్లమని చెప్పిన కేంద్రం... అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతోంది. దేశంలోని వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం చెప్తే ఢిల్లీ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ అక్కడ కూడా కేంద్రం నియంత్రణ ఉంది. ఇకనైనా కేంద్రం ఈ విషయంలో కాస్త సీరియస్గా దృష్టి సారించాలి.' అని ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇదంతా మీకు జోక్గా కనిపిస్తోందా...?'
'గతేడాది డిసెంబర్లో అమెరికా ఫైజర్,మోడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వీటికి అనుమతినివ్వలేదు. ఇతర దేశాల్లో వాటికి అనుమతినివ్వడమే కాదు విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుపుతున్నారు. కానీ భారత్లో ఇందుకు అడ్డొస్తున్న పరిస్థితులేంటి. ఇప్పటికీ మనం కేవలం రెండు వ్యాక్సిన్ కంపెనీల పైనే ఆధారపడుతున్నాం. అవి కూడా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. రష్యా గతేడాది అగస్టులో స్పుత్నిక్ వికి అనుమతులిచ్చి డిసెంబర్లో వ్యాక్సినేషన్ ప్రారంభించింది. అప్పట్లో దాన్ని తిరస్కరించిన భారత్ ఇప్పుడు అనుమతినిచ్చింది.ఇప్పటికే 68 దేశాలు స్పుత్నిక్ విని ఉపయోగిస్తున్నాయి. ఫైజర్కు డిసెంబర్లో యూకె అనుమతినిచ్చింది. ఇప్పటికే 85 దేశాలు ఆ వ్యాక్సిన్ వాడుతున్నాయి. 46 దేశాలు మోడెర్నా,41 దేశాలు జాన్సన్ అండ్ జాన్సన్ వాడుతున్నాయి. కానీ మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. ఇదంతా మీకు(కేంద్రం) జోక్గా కనిపిస్తోందా... గ్లోబల్ టెండర్లకు వెళ్లమని చెప్తారు... కానీ ఆ వ్యాక్సిన్లకు అనుమతులు మాత్రం ఇవ్వరు..' అని మనీష్ సిసోడియా కేంద్రంపై విరుచుకుపడ్డారు.
'కేంద్రం ఇంకా నిద్రపోతోంది...'
అమెరికా,యూరోప్ దేశాలు గతేడాది నవంబర్ నాటికే తమ జనాభాకు తగినన్ని వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్స్ ఇచ్చాయని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గతేడాది సీరమ్ ఇన్స్టిట్యూట్ను మోదీ సందర్శించారని... కానీ వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్స్ ఇవ్వలేదని అన్నారు. అమెరికా గతేడాది మార్చిలోనే వ్యాక్సిన్ల కొనుగోళ్లకు పెట్టుబడులు పెడితే భారత్ ఈ ఏడాది ఏప్రిల్ దాకా ఆ పని చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని... ఇప్పటికీ నిద్రలోనే ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో వ్యాక్సిన్ల కొరత కారణంగా 18-44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిలిపివేశారు. ఢిల్లీలో 2 కోట్ల పైచిలుకు జనాభా ఉండగా ప్రతీ నెలా 80 లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరమని గతంలో సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కానీ మే నెలలో కేంద్రం ఢిల్లీకి కేటాయించింది కేవలం 16 లక్షల డోసులు మాత్రమే. ఈ లెక్కన ఢిల్లీలో వ్యాక్సిన్ పూర్తయ్యే సరికి చాలా నెలలు పడుతుందని చెబుతున్నారు. కేవలం ఢిల్లీలోనే కాదు,దేశమంతా ఇదే పరిస్థితి నెలకొందని సిసోడియా వాపోయారు.
Recommended Video
కేంద్రం తదుపరి చర్యలు..?
గ్లోబల్ టెండర్ల విషయంలో మొదట పంజాబ్కు చుక్కెదురైంది. కంపెనీల పాలసీ ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తామని మోడెర్నా,ఫైజర్ కంపెనీలు స్పష్టం చేశాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఇదే విషయం చెప్పాయి. ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవొచ్చు. అదే జరిగితే దేశంలో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగినట్లే.. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఈ విషయంలో నిర్దిష్ట ప్రణాళిక రూపొందించకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ విక్రయించేలా అంతర్జాతీయ మాన్యుఫాక్చరర్స్ను ఒప్పించడం లేదా కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం... ఇవి రెండే ఇప్పుడు కేంద్రం ముందున్న ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటిలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.