శశికళది దోపిడీ ముఠా: అన్నాడీఎంకే ఎంపీల్లో చీలిక, పన్నీరుకు పెరిగిన మద్దతు
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలుగా ఇప్పుడు ఆ పార్టీ విడిపోయినట్లు తెలుస్తోంది.
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలుగా ఇప్పుడు ఆ పార్టీ విడిపోయినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు శశికళకు విధేయత ప్రకటించిన పన్నీరు సెల్వం.. పార్టీ పదవి నుంచి తొలగించడంతో ఆమెపై తిరుగుబాటు ప్రకటించారు.
జయలలిత తనను పార్టీకి కోశాధికారిగా నియమించారని.. ఇప్పుడు తనని పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని పన్నీరు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇస్తూ తాను ఇచ్చిన పత్రాన్ని కూడా వెనక్కి తీసుకుంటానని చెప్పారు. అంతేగాక, బల పరీక్షకు కూడా సిద్ధమని, గవర్నర్ను కలుస్తానని చెప్పారు.
జయ మృతిపై శశికళకు షాక్: దీప మద్దతు తీసుకుంటామన్న సెల్వం
బుధవారం ఉదయం పన్నీరు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు మైత్రేయన్, పొన్నుస్వామి, మాజీ స్పీకర్ పాండియన్ అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. అంతేగాక, శశికళపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శశికళది ఓ దోపిడీ బృందమని మైత్రేయన్, పాండియన్ ఆరోపించారు. రెండు గంటలపాటు నిర్బంధించి బలవంతంగా సెల్వంతో రాజీనామా చేయించారని శశికళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్వంకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వారు చెప్పారు. డబ్బు, అధికారం కోసమే శశికళ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇది ఇలా ఉండగా, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ శశికళ వెంటే ఉన్నారని., తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ పదవీ బాధ్యతలు చేపట్టడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడీఎంకే పార్టీకి చెందిన మరో ఎంపీ నవనీత్ కృష్ణన్ చెప్పడం గమనార్హం.