ట్విస్ట్, రంగంలోకి అజంఖాన్: ఫోన్లో మాట్లాడుకొని.. గంటలుగా మంతనాలు
అఖిలేష్ - ములాయంల మధ్య సంధికోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరి భేటీకి ఆజం ఖాన్ మధ్య వర్తిత్వం వహించారని చెబుతున్నారు.
లక్నో: సమాజ్వాది పార్టీలో తండ్రీకొడుకుల మధ్య రాజకీయ సమరం వేడి రాజుకుంది. పార్టీ చీలిక దిశగా కూడా కనిపిస్తోంది. పార్టీ గుర్తు అయిన సైకిల్ కోసం ఇటు అఖిలేష్, అటు ములాయం పోరాడుతున్నారు. ఈసీ వరకు గొడవ వెళ్లింది.
అఖిలేష్-ములాయం మధ్య అజంఖాన్ మధ్యవర్తిత్వం
రానున్న ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు, తిరిగి సమాజ్వాది పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కొందరు నేతలు రంగంలోకి దిగారు. అజం ఖాన్ వంటి నాయకులు ములాయం సింగ్, అఖిలేష్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముందుకు వచ్చారు.
ఫోన్లో మంతనాలు
తొలుత ముఖ్యమంత్రి అఖిలేష్, తండ్రి ములాయంలు ఫోన్లో మాట్లాడుకున్నారు. దీని తర్వాత ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ములాయం ఉదయం ఒక చార్టర్డ్ విమానంలో లక్నోకు తిరుగుపయనమయ్యారు.
ఇరువురి మధ్య సంధికి యత్నం
దీంతో వీరి మధ్య సంధికోసం ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం అప్పటికే తెలిసిపోయింది. వీరి భేటీకి ఆజం ఖాన్ మధ్య వర్తిత్వం వహించారని చెబుతున్నారు. గత వారం కూడా ఆయన వీరిద్దరి భేటీ నిర్వహించారు. ఇప్పుడు, మరోసారి అఖిలేష్ - ములాయం భేటీ అయ్యారు. వీరి భేటీకి ములాయం వర్గం శివపాల్ యాదవ్ దూరంగా ఉన్నారు. గంటన్నరకు పైగా ఇరువురు భేటీ అయ్యారు.
భేటీకి శివపాల్ దూరం
నేడు అఖిలేష్ వర్గానికి చెందిన రామ్ గోపాల్ యాదవ్ సైకిల్ గుర్తుకోసం ఎన్నికల కమిషన్ను కలవాల్సి ఉంది. కానీ ఎన్నికల సంఘం ప్రస్తుతానికి ఈ గుర్తును ఎవరికీ కేటాయించకుండా ఉండే అవకాశముంది.