వినోదంలో విషాదం: జలపాతంలో 11 మంది గల్లంతు
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్జిల్లా పాతింగ్పట్నం సమీపంలోని బాగ్దారి జలపాతంలో 11 మంది కొట్టుకుపోయారు. వారిలో 8 మంది మృత దేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. పాటింగ్ సమీపంలోని థక్కర్ గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన మొత్తం 27 మంది బాగ్దారి జలపాతం దగ్గర విహార యాత్రకు వెళ్లారు.
జలపాతానికి చేరుకోడానికి వారు ఒక వాగును దాటవలసి వచ్చింది. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు వారిలో 15 మంది క్షేమంగా వాగు దాటుకుని వచ్చారు. అదే సమయంలో వాగు ఒక్కసారిగా పొంగడంతో 11 మంది కొట్టుకుపోయారు.
వారిలో షబ్నమ్ అనే 20 ఏళ్ల అమ్మాయి ఒక రాయిని పట్టుకుని ప్రాణాలు రక్షించుకోగలిగింది. ఆమెను స్థానికులు వెలికి తీశారు. ముగ్గురి ఆచూకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే జలపాతం వంద అడుగుల ఎత్తులో ఉండడంతో దానిలో కొట్టుకుపోయినవారు బతికుండే అవకాశం లేదని తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు అధికారులు రూ. లక్ష పరిహారం ప్రకటించారు.
భారీ వర్షం కారణంగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి, నీటి మట్టం పెరిగాయి. ఇరవై ఏళ్ల అమ్మాయిని స్థానికులు బయటకు తీసి, ఆస్పత్రిలో చేర్పించారు.