లోనికి వెళ్తూ జగన్: ధర్నా చేస్తూ టిడిపి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: విభజన రాజకీయాలతో గత కొద్ది రోజులుగా ఢిల్లీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సభలో సమైక్యాంధ్ర కోసం తీవ్ర గందరగోళం సృష్టిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. కొద్ది మంది సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు కూడా సమైక్య నినాదాలతో పార్లమెంటు సమావేశాలను వేడెక్కిస్తూ వచ్చారు.
బుధవారంనాడు ప్రభుత్వం లోకసభలో లోక్పాల్ బిల్లును ప్రతిపాదించి ఆమోదింపజేసుకుంది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల నినాదాల మధ్యనే సభ్యులు బిల్లుపై మాట్లాడారు. బిల్లును లోకసభ ఆమోదించింది. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యుడు కొనకళ్ల నారాయణ, సబ్బం హరి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు.
సభ్యులు ప్రశాంతంగా ఉంటే, నోటీసులకు 50 మంది సభ్యుల మద్దతు ఉందో లేదో తెలుసుకోవడానికి వీలవుతుందని స్పీకర్ మీరా కుమార్ చెప్పినా సభ సద్దుమణగలేదు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెసు, తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, జగన్ సహా వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా ఆమె లోక్పాల్ బిల్లును చర్చకు చేపట్టారు. బిల్లును ఆమోదించిన తర్వాత సభ వాయిదా పడింది.
సేవ్ ఆంధ్రప్రదేశ్..
సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ధర్నాకు దిగారు.
లోనికి వెళ్తూ జగన్..
తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ధర్నా చేస్తుండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లోనికి వెళ్తూ కనిపించారు.
టిడిపి సభ్యులతో ఎస్పీవై రెడ్డి..
ధర్నా చేస్తున్న తెలుగుదేశం సీమాంధ్ర సభ్యులతో మాట్లాడుతున్న ఎస్పీవై రెడ్డి. ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
పోన్నం ఫైర్..
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల తీరుపై తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెసు అధిష్టానంపై ఫైర్..
అవిశ్వాస తీర్మానం విషయంలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మండిపడ్డారు. తమవారితో కాంగ్రెసు గందరగోళం సృష్టింపజేసి అవిశ్వాసం నోటీసులు చర్చకు రాకుండా చూస్తోందని ఆయన విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెసు ఎంపీలు
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్న తీరును, ప్రభుత్వ తీరును వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు మైసురా రెడ్డి, పార్టీ ఎంపీలు తప్పు పట్టారు.
బలరాం నాయక్తో ఆనందభాస్కర్..
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ ఫోన్లో మాట్లాడుతుండగా రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ఇలా కనిపించారు.