IndiGo: ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్..! పైలట్లకు డీజీసీఏ మరో షాక్..!
దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో(IndiGo Airlines)లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు రోజులుగా ఇండిగో విమానాలు భారీ స్దాయిలో ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడంలో ఇండిగో విఫలమవుతోంది. దీంతో తొలుత ఇండిగో ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ ఆ తర్వాత కూడా సమస్య కొనసాగుతుండటంతో చేసేది లేక చర్యలకు దిగుతోంది.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో నిన్న రాత్రి ఓ పైలట్ వరుసగా ఎన్ని గంటలు ప్రయాణించవచ్చనే దానిపై ఉన్న 12 గంటల పరిమితిని డీజీసీఏ 14కి పొడిగించింది. దీంతో పైలట్లకు ఓ షాక్ తగిలింది. ఇవాళ డీజీసీఏ పైలట్లకు మరో షాకిచ్చింది. వారంలోఓ రోజు అదనంగా పనిచేయాల్సి వస్తే దానికి బదులుగా మరొకరోజు సెలవు తీసుకునేలా గతంలో ఇచ్చిన ఊరటను ఉపసంహరించింది. దీంతో 24 గంటల్లోనే పైలట్లపై డీజీసీఏ రెండో కీలక నిర్ణయం తీసుకున్నట్లయింది.

డీజీసీఏ తాజా ఆదేశాల ప్రకారం పైలట్లు, విమాన సిబ్బందిని నియమించేటప్పుడు ఎయిర్ లైన్ సంస్థలు సెలవు, వారపు విశ్రాంతి రోజు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అయితే రాత్రిపూట విమానాలకు మాత్రం ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చింది. అయితే విమానయాన సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే నిబంధనల్ని పూర్తిగా పాటిస్తున్నట్లు ప్రతీ 30 రోజుల రోడ్ మ్యాప్ ను సమర్పించాల్సి ఉంటుంది.

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎదుర్కొంటున్న విమానాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి డీజీసీఏ మరికొన్ని చర్యలు కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్న విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇవాళ అర్ధరాత్రి కల్లా సమస్య పరిష్కారం అవుతుందని ఇండిగో చెబుతోంది. తేడా వస్తే మాత్రం ఇండిగోతో పాటు డీజీసీఏ, కేంద్రం కూడా మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు.












Click it and Unblock the Notifications