వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: ఎంసీసీ, కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్
న్యూఢిల్లీ: నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో భారత వైద్య మండలి(ఎంసీసీ), కేంద్రంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ వైపు దేశంలో వైద్యుల కొరత ఉన్న సమయంలో.. మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది 1456 సీట్లు ఖాళీగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏ సాధించారని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అంతేగాక, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా? అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాలో 1456 సీట్లు ఖాళీగా ఉండటంతో ఆ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ కొందరు వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్దా బోస్ లతో కూడిన ధర్మాసనం.. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క సీటు ఖాళీగా ఉందని తెలిసినా.. దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత మీదే. నీట్ పీజీలో దేశ వ్యాప్తంగా 1456 సీట్లు కాలేదని అధికారులు మే నెలలోనే గుర్తించారు. అలాంటప్పుడు మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్ ఎందుకు నిర్వహించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది.
దేశంలో డాక్టర్ల అవసరం ఉన్నప్పుడు.. సీట్లను ఖాళీగా ఉంచి మీరేం సాధించారు? సీట్ల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా? విద్యార్థుల భవితతో మీరు ఆటలాడుతున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నీట్ పీజీ కౌన్సిలింగ్ సీట్ల భర్తీ, ఖాళీలపై నేటి సాయంత్రంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై గురువారం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.