జైలు నుండి పోటీ చేయొచ్చు: సుప్రీం నిర్ణయంతో ఊరట
ఇప్పటికే ప్రజాప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ దృష్ట్యా ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. అయితే ఈ సవరణ రాజ్యాంగబద్ధత అంశాన్ని విడిగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ను లోక్ ప్రహారీ అనే ఎన్జీవో సంస్థ సవాల్ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఈ ఎన్జీవో సంస్థ ప్రజాప్రాతినిధ్య చట్టానికి జరిగిన సవరణను సవాల్ చేసింది.
అయితే, ఈ సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనను విడిగా పరిశీలిస్తామని న్యాయమూర్తులు ఎకె పట్నాయక్, ఎస్జె ముఖోపాధ్యాయ్లతో కూడిన సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ సవరణ పర్యావసానంగా ఏ వ్యక్తి అయినా పోలీస్ కస్టడీ లేదా జైలు శిక్ష కారణంగా ఓట హక్కును కోల్పోయే అవకాశం ఉండదని సుప్రీం తెలిపింది.
దీని దృష్ట్యా సదరు వ్యక్తి రాష్ట అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని వెల్లడించింది. తాజా సవరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రివ్యూ పటిషన్ అర్థరహితంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 10న ఇచ్చిన తీర్పులో పోలీస్ కస్టడీలో లేదా జైల్లోవున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.