ప్లీజ్ నక్సల్ అంకుల్.. మా నాన్నను విడిచిపెట్టరా... మిస్సింగ్ సీఆర్పీఎఫ్ జవాన్ కూతురు విజ్ఞప్తి...
ఛత్తీస్గఢ్ అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు-మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 22 మంది జవాన్లు అమరులైన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే జవాన్ మావోయిస్టుల నిర్బంధంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జవాను కూతురు,చిన్నారి రాఘవి నక్సలైట్లకు వీడియో సందేశం ద్వారా ఒక విజ్ఞప్తి చేసింది. 'నక్సల్ అంకుల్... ప్లీజ్ మా నాన్నను ఇంటికి పంపించరా...' అని వేడుకుంది.
నక్సలైట్లకు చిన్నారి రాఘవి విజ్ఞప్తి...
'నేను నాన్నను మిస్సవుతున్నాను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నక్సల్ అంకుల్... మా నాన్నను విడిచిపెట్టి ఇంటికి పంపించరా..' అని రాకేశ్వర్ సింగ్ మన్హాస్ కుమార్తె రాఘవి నక్సల్స్కు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. చిన్నారి మాటలతో ఆమె కుటుంబమంతా కన్నీళ్లు పెట్టుకోగా... ఆ చిన్నారి కూడా కన్నీటిపర్యంతమైంది. రాకేశ్వర్ ఏడేళ్ల మేనల్లుడు ఆకాష్ కూడా మా మామ ఎక్కడున్నారో మీకే తెలిసే ఉంటుంది కదా అని... వారి ఇంటికెళ్లిన మీడియా రిపోర్టర్స్ను ఆరా తీయడం గమనార్హం.
నా నంబర్ అతనికెలా తెలిసింది : రాకేశ్వర్ భార్య
రాకేశ్వర్ మన్హాస్ భార్య మీనూ మన్హాస్ మాట్లాడుతూ.. 'ఐదు రోజుల క్రితం నేను నా భర్తతో ఫోన్లో మాట్లాడాను. ఏదో ఆపరేషన్కు వెళ్తున్నానని... తిరిగొచ్చాక ఫోన్ చేస్తానని చెప్పారు. టీవీలో నక్సల్స్ దాడి గురించి చూసి వెంటనే మా ఆయనకు ఫోన్ చేశాను. కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు.' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాకేశ్వర్ తోటి జవాను ఒకరికి ఫోన్ కాల్ చేయగా... నక్సల్స్ దాడిలో ఆయన మిస్సయ్యారని చెప్పారన్నారు. 'సోమవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. తాను బీజాపూర్ నుంచి ఒక రిపోర్టర్ను మాట్లాడుతున్నట్లు చెప్పారు. నా భర్తను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని.. వీడియో సందేశం ద్వారా ఆయన్ను వదిలిపెట్టమని కోరాలని చెప్పారు. దీంతో అతను చెప్పినట్లే చేశాను. అయితే ఎక్కడో బీజాపూర్లో ఉన్న వ్యక్తికి నా ఫోన్ నంబర్ ఎలా తెలిసింది. దీనిపై విచారణ జరపాలి.' అని మన్హాస్ విజ్ఞప్తి చేశారు.
వెనక్కి తీసుకొస్తారని నమ్ముతున్నాం.. : రాకేశ్వర్ భార్య
ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన భర్తను సురక్షితంగా తీసుకొస్తారని రాకేశ్వర్ మన్హాస్ భార్య మీనూ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని చెప్పిన ప్రధాని... చెప్పినట్లే చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తన భర్తను కూడా సురక్షితంగా వెనక్కి తీసుకొస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. తన కూతురు తండ్రి కోసం అవిరామంగా ఏడుస్తూనే ఉందని చెప్పారు. మన్హాస్ తల్లి(75) కుంతీ దేవి కూడా ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకొస్తుందని... ఇందుకోసం మావోయిస్టులతో చర్చలు జరుపుతారని భావిస్తున్నట్లు తెలిపారు. తన భర్త కూడా సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేసి దేశం కోసం ప్రాణాలిచ్చారని అన్నారు. తండ్రి స్పూర్తితోనే రాకేశ్వర్ కూడా సీర్పీఎఫ్లో చేరారని తెలిపారు.
రాకేశ్వర్ కుటుంబానికి భరోసా...
ప్రస్తుతం రాకేశ్వర్ మన్హాస్ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. నిజానికి ఈ నెల 15న బంధువుల పెళ్లికి వస్తానని రాకేశ్వర్ మన్హాస్ భార్యతో చెప్పాడు. మరికొద్ది రోజుల్లో ఇక తను ఇంటికొస్తాడని భావిస్తుండగా... ఇంతలోనే ఈ దాడి జరిగింది. రాకేశ్వర్ కుటుంబానికి సీర్పీఎఫ్తో పాటు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని జమ్మూకశ్మీర్లోని సీర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ కమాండెంట్ పీజీ గుప్తా తెలిపారు. ఈ దాడిలో ధైర్యవంతులైన తమ జవాన్లను కోల్పోయామని... రాకేశ్వర్ మన్హాస్ను వెనక్కి తీసుకొస్తామని చెప్పారు.