ఓటు వెయ్యండి .. డీజిల్. పెట్రోల్ ధరలపై 50పైసలు రాయితీ పొందండి
ఓటు మనందరి హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా.. అలాంటి ఓటుహక్కును వినియోగించుకోనివారు ఎందరో. నా ఒక్కరి ఓటుతో ఏమవుతుంది? నేను ఓటేయకుంటే ఏం నష్టం అని అలోచించి చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోరు. కానీ అలా చెయ్యటం తప్పు . దేశ భవిష్యత్ బాగుపడాలంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు అయిన ఓటుహక్కును వినియోగించుకోవాలి . ఇక ఓటు వెయ్యకుండా నిర్లక్ష్యం ప్రదర్శించే వారిలో మార్పు కోసం, ఓటరు చైతన్యం కోసం పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నడుం బిగించింది.
సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!
ఓటుహక్కు వినియోగించుకుంటే పెట్రోల్, డీజిల్ మీద రాయితీ
ఓటు హక్కు వినియోగించుకోండి. పెట్రోల్ ,డీజిల్ పై 50పైసల రాయితీ పొందండి అంటూ ప్రచారం ప్రారంభించింది ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ . దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్లలో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే రోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే వారికి పెట్రోలు, డీజిల్ పై లీటరుకు 50 పైసలు రాయితీ ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.
ఓటు వేసి వేలిపై సిరా చుక్క చూపిస్తే చాలు .. రాయితీ వర్తింపు
ప్రజాస్వామ్యం వెల్లివిరియాలంటే ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బాధ్యులుగా తమ వైపు నుంచి భాగస్వామ్యం అందిస్తున్నామని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సల్ చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకే అసోసియేషన్ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎవరైనా ఓటువేసి, వేలిపై సిరా గుర్తు చూపిస్తే వారికి ఇంధనంపై లీటరుకు 50 పైసలు రాయితీ ఇవ్వనున్నారు. వినియోగదారులు ఓటు వేసిన సిరా గుర్తు చూపించటంతో పాటు వారి పేరు ఫోన్ నెంబరు పెట్రోల్ బంకు లో సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదుపాయం కల్పించనున్నారు.
ఓటర్లలో చైతన్యం కోసం ఈ తరహా ప్రయోగం చేస్తున్న పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
ఓటరు చైతన్య కార్యక్రమాల ద్వారా ఓటుహక్కు వినియోగానికి ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఈ తరహా రాయితీలను ఏవైనా ప్రకటిస్తే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వుంటుంది. అందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా పెట్రోలియం అసోసియేషన్ బాధ్యులు ఓటర్లలో చైతన్యం తీసుకు వచ్చే ఈ తరహా కృషి చేయటం నిజంగా ప్రశంసనీయం . మరి ఇంకెందుకు ఆలస్యం ఓటు హక్కు వినియోగించుకుని లీటరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ 50పైసల రాయితీ పొందండి.