సునంద పుష్కర్ హత్య: ఇంజక్షన్ మచ్చపై పోలీస్ దృష్టి
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సునంద పుష్కర్ మృతి కేసు కీలకమైన మలుపులు తిరుగుతోంది. సునంద పుష్కర్కు ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించి ఉంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె శరీరంపై ఉన్న ఇంజక్షన్ మచ్చపై పోలీసులు తాజాగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సునంద పుష్కర్ విషం ఎక్కించడం వల్ల మరణించారని, ఆమెది హత్య అని ఢిల్లీ పోలీసులు తేల్చారు.
సునంద పుష్కర్ హత్య కేసులో పోలీసులు శశి థరూర్తో పాటు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది. పోలోనియం 210 గానీ, థాలియం గానీ ఆమెకు ఎక్కించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రెండింటితో పాటు మరిన్ని విషపూరిత పదార్థాలను కూడా పరీక్షిస్తున్నారు. అయితే, వాటిని భారతదేశంలోని ల్యాబ్స్లో పరీక్షించడం సాధ్యం కాదు. దీంతో విదేశీ లాబొరేటరీలను ఆశ్రయించాలనే ఉద్దేశంతో ఉన్నారు.

తొలుత ఉన్న దర్యాప్తు అధికారిని పక్కకు తప్పించి, సునంద పుష్కర్ మృతి కేసులో తాజా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. విషాన్ని నోటి ద్వారా పంపించారా, ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అనేది కూడా స్పష్టంగా తేలలేదు. సునంద పుష్కర్ శరీరంలోని అంతర్భాగాలను విదేశీ ల్యాబ్లకు పంపించాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. ఏ విధమైన విషాన్ని ఎక్కించారు, ఎంత మోతాదులో ఎక్కించారనేది ఆ పరీక్షల ద్వారా తేలుతుంది. అందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.
గాయం సంఖ్య పదిపై పోలీసులు ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు సమాచారం. అది ఇంజక్షన్ మచ్చకు సంబంధించింది. సునంద పుష్కర్ శరీరంపై 15 గాయాలున్నట్లు తేలింది. ఇంజక్షన్ మచ్చ అందులో పదోది. సునంద పుష్కర్ది అసహజ మరణమని, విషం వల్ల మరణించిందని, అయితే విషాన్ని నోటి ద్వారా పంపించారా.. ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అనేది చెప్పలేమని ఎయిమ్స్ వైద్యులు చెప్పారని, మరిన్ని విషయాలు కూడా చెప్పారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications