మన్మోహన్పై మోడీ వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పే సమస్యే లేదు.. తెగేసి చెప్పిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ పాకిస్తాన్తో కుమ్మక్కయ్యారంటూ గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాల దుమారం రాజ్యసభను బుధవారం కూడా కుదిపేసింది.
ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ విపక్షాలు సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరూ క్షమాపణ చెప్పరు..' అంటూ ఆయన తేల్చిచెప్పారు.

ప్రధాని మోడీ పార్లమెంటులో ఆ వ్యాఖ్యలు చేయనందున విపక్షాలు కోరినట్టు పార్లమెంటులో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
'ఇది పద్దతి కాదు. ఎవరూ క్షమాపణ చెప్పరు. సభలో జరిగిన వ్యవహారం కాదిది. సభలో అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు..' అని వెంకయ్యనాయుడు ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులతో అన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు గత శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన రోజునుంచీ కాంగ్రెస్ ఇదే ఆందోళనతో సభాకార్యక్రమాలకు అడ్డుపడుతోంది. ప్రధాని మోడీ.. మన్మోహన్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాల హోరెత్తించింది.
బుధవారం కూడా కాంగ్రెస్ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. మన్మోహన్పై దారుణ ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడింయను చుట్టుముట్టారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభాకార్యక్రమాలను మధ్యాహ్నం వరకూ వాయిదా వేశారు.
మధ్యాహ్నం తిరిగి సభ సమావేశం అవగానే కాంగ్రెస్ ఎంపీలు మళ్లీ మోడీ క్షమాపణ అంశాన్ని లేవనెత్తారు. దీంతో వెంకయ్య నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. 'ఇది పార్లమెంటు. పెద్దల సభ. ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేసే ఆనవాయితీ లేదు. సభను అపహాస్యం చేయొద్దు. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి..' అని అన్నారు.
సభా కార్యక్రమాలకు అడ్డుతగలవద్దని, కీలక అంశాలపై సభ్యులు మాట్లాడేందుకు వీలు కల్పించాలని ఎంపీలకు సూచించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో సభ మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
అటు లోక్సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశంపై తమ ఆందోళన కొనసాగించారు. మన్మోహన్ సింగ్కు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ప్రధాని మోడీ సభలోనే ఉన్నారు. సభ్యుల ఆందోళన నేపథ్యంలో తొలుత సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications