శభాష్... మీరు ఆదర్శంగా నిలిచారు: సాహస బాలల పురస్కారాల విజేతలతో ప్రధాని మోడీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పిల్లలకు కేంద్ర ప్రభుత్వం సాహస పురస్కారాలను అందజేస్తోంది. ఈసారి కూడా దేశవ్యాప్తంగా అత్యంత సాహసాలు ప్రదర్శించిన పిల్లలను గుర్తించి వారికి సాహస పురస్కారం అందజేయడం జరిగింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ పేరుతో వీటిని అందజేస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 2019 సాహస పురస్కార అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. వారితో ప్రత్యేకంగా సమావేశమైన మోడీ... చిన్నారులు వారి జీవితాల్లో జరిగిన ఘటనల గురించి ప్రధానితో పంచుకున్నారు.
పిల్లలను అభినందించిన ప్రధాని మోడీ
పిల్లలు ప్రధాని మోడీతో తాము సాధించిన విజయాల గురించి చెప్పారు. అదే సమయంలో వారు ఒకరికి ఎలా స్ఫూర్తిదాయకంగా నిలిచారో కూడా ముచ్చటించారు. చిన్నపిల్లలు చెబుతున్నప్పుడు ప్రధాని ఎంతో ఆసక్తిగా విన్నారు. వారు పలికే ముద్దు ముద్దు మాటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. వారితో చాలా సమయం గడిపారు ప్రధాని. వారు సాధించిన విజయాలపై మోడీ పిల్లలను అభినందించారు.
పిల్లల్లో నైపుణ్యత బయటకు వస్తుంది
బాలలకు ప్రదానం చేసిన సాహస పురస్కారాల అవార్డులు వారికి ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని ప్రధాని అన్నారు. అంతేకాదు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తాయని తద్వారా ఇతరులకు వీరు ఆదర్శప్రాయంగా నిలుస్తారని ప్రధాని మోడీ చెప్పారు. ఈ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరూ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. అంతేకాదు ఈ అవార్డులు పొందిన పిల్లలందరూ ప్రకృతితో స్నేహం చేయాలని పిల్లలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలిన ఈ సందర్భంగా మోడీ అన్నారు.
ప్రధానిని కలవడం ఒక మధుర జ్ఞాపకం అన్న పిల్లలు
ప్రధాని నరేంద్ర మోడీ అవార్డులు పొందిన పిల్లలతో సమయం గడపడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రధాని తమతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు మోడీతో ఫోటోలు దిగడం వారి జీవితాంతం మర్చిపోలేమన్న అవార్డు గ్రహీతలు మోడీని అడిగి ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నామని తెలిపారు. మోడీతో గడిపిన క్షణాలు జీవితాంతం తమకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపారు. దేశానికి మోడీలాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని వారు అభిలషించారు.
స్కేటింగ్లో బాల్శక్తి పురస్కారం దక్కించుకున్న ఏపీ విద్యార్థి
ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రియం అనే విద్యార్థికి బాల్ శక్తి పురస్కార్ అవార్డు వరించింది. అంతర్జాతీయ వేదికలపై స్కేటింగ్లో తన ప్రతిభను చాటిన ప్రియంను ప్రధాని మోడీ అభినందించారు. భారత్ గర్వపడేలా ప్రియం విజయాలు ఉన్నాయని ఈ సందర్భంగా మోడీ కొనియాడారు.
రాష్ట్రీయ బాల్ పురస్కారాల గురించి...
రాష్ట్రీయ బాల్ పురస్కారాలు రెండు విభాగాల్లో ఇవ్వడం జరిగుతుంది. వ్యక్తులకు బాల్ శక్తి పురస్కార్ అవార్డులు, పిల్లల కోసం పనిచేసే సంస్థలకు బాల్ కల్యాణ్ పురస్కార్ పేరుతో ఈ అవార్డులను కేంద్రం ఇస్తుంది. అయితే ఈ ఏడాది బాల్ శక్తి పురస్కారాల విభాగానికి 783 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ అవార్డులకు 26 మందిని ఎంపిక చేసింది. వైవిధ్యత, పాండిత్యం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ, సాహసం లాంటి అంశాలను అవార్డు ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. ఈసారి ఇద్దరు వ్యక్తులను మూడు సంస్థలను బాల్ కల్యాణ్ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.