అకౌంట్ లో PM-KISAN నిధులు జమ- ఇలా చెక్ చేయండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే PM-కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన వారణాసిలో పర్యటిస్తోన్నారు. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు.
ఈ విడత ద్వారా 9.7 కోట్లకు పైగా అర్హులైన రైతులకు రూ. 20,500 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్నందున.. ఈ ఆర్థిక సహాయం దేశవ్యాప్తంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్ పుట్ కొనుగోలు వంటి అవసరమైన ఖర్చుల కోసం ఈ మొత్తం దోహదపడుతుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. రైతులను బలోపేతం చేయడానికి, వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, లాభదాయకంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ నిధుల విడుదల.. రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశవ్యాప్తంగా భూమి ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో ఈ మొత్తం జమ అవుతుంది.
ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ మొత్తం DBT ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి రైతులకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. రైతులు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. ఈ-కేవైసిని పూర్తి చేయాలి. వారి ఆధార్ నంబర్ ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించి ఉండాలి. భూ రికార్డులు అప్ డేట్ అయివుండాలి.
2025 నాటికి- ఈ పథకం 11 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూర్చింది. 19వ విడత నిధులు ఈ ఏడాాది ఫిబ్రవరి 24వ తేదీన విడుదలయ్యాయి. నిజానికి జూన్ లోనే ఈ మొత్తం విడుదల కావాల్సి ఉండగా.. ఆలస్యమైంది. జూలై 2 నుండి 9 వరకు మోదీ విదేశీ పర్యటన కారణంగా ఈ విడుదల ఆలస్యమైంది.
20వ విడత నిధులతో కలిపి, PM-కిసాన్ పథకం కింద మొత్తం పంపిణీ నాలుగు లక్షల కోట్ల రూపాయలను దాటింది. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. రైతులు తమ ఖాతాల్లో డబ్బు జమ అయిందో లేదో ఇలా చెక్ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inను సందర్శించాలి. హోమ్ పేజీలో Farmer's Corner ను క్లిక్ చేయాలి. ఇందులో Know Your Status సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, 'Get OTP' క్లిక్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన OTPని అందులో పొందుపరిస్తే.. స్టేటస్ తెలిసిపోతుంది.












Click it and Unblock the Notifications